అబే సాలే అంటే ఏదో అనుకున్నా: సుందర్ పిచాయ్
జనవరి 4న ఇండియాకు వచ్చిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 23 ఏళ్ల తర్వాత ఒకప్పుడు ఖరగ్ పూర్ లో తాను విద్యనభ్యసించిన ఐఐటిని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
ఖరగ్ పూర్: తాను అబే సాలే.. అనేది స్నేహపూర్వక పలకరింపు అనుకునేవాడినని.. ఐఐటిలో చేరిన కొత్తలో ఎవరినైనా పిలవాల్సి వచ్చినప్పుడు అలా పిలిచేవాడినని, ఆ రోజుల్లో తనకు హిందీ అంత బాగా వచ్చేది కాదని, అది ఒకరకమైన తిట్టన్న విషయం తాను గ్రహించలేకపోయానని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
జనవరి 4న ఇండియాకు వచ్చిన ఆయన 23 ఏళ్ల తర్వాత ఒకప్పుడు ఖరగ్ పూర్ లో తాను విద్యనభ్యసించిన ఐఐటిని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. పిచాయ్ రాక కోసం నిరీక్షించిన వందలాది మంది భావి ఐఐటియన్లు ఆయన్ను చూసేందుకు, మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. విద్యార్థిగా పలు స్మృతులు నెమరువేసుకున్న పిచాయ్ అనేక ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు.
డిజిటల్ ఎకానమీలో ఇండియా ప్రముఖ పాత్ర పోషించనుందని, వచ్చే 5-10 సంవత్సరాలలో స్టార్ట్ అప్స్ కు భారత మార్కెట్ లో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తాము ప్రస్తుతం ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ తయారీపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
పలు వ్యక్తిగత విషయాలు...
విద్యార్థులతో ముచ్చటించిన సుందర్ పిచాయ్ పలు వ్యక్తిగత విషయాలు, అభిరుచులు వెల్లడించారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తనకు ఇష్టమైన భారతీయ నటి అని, అలాగే ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఫేవరేట్ క్రికెటర్ అని, అతడి ఆటే ఎక్కువగా చూసేవాడినని చెప్పారు.
మొట్టమొదటిసారిగా ఐఐటి ఖరగ్ పూర్ లోనే తాను కంప్యూటర్ ను చూశానని, 20 ఏళ్ల వయసులో తొలిసారిగా విమానం ఎక్కానని, ఇప్పుడైతే భారత్ లో ఏడాదికి 10 లక్షల మందికి పైగానే విమానాల్లో ప్రయాణిస్తున్నారని, భారత్ అంతగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
నేనూ క్లాసులకు బంక్ కొట్టేవాణ్ని...
తాను కూడా రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని చదివేవాడినని, ఫలితంగా పొద్దున్న క్లాసులు మిస్సయ్యేవాడినని, అందరిలాగే తాను కూడా క్లాసులకు బంక్ కొట్టేవాడినని, హాస్టల్ ఫుడ్ లో ఆ రోజు పప్పా, సాంబారా అని ఎదురు చూసేవాడినని విద్యార్థుల నవ్వుల మధ్య పిచాయ్ చెప్పారు. తనకు ఆ రొజుల్లో హిందీ కూడా అంతబాగా వచ్చేది కాదని అన్నారాయన.
విద్యావిధానం మారాలి ..
దేశంలో విద్యావ్యవస్థ విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగా ఉందని, ఇది మారాలని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ఐఐటి లో సీటు రావాలంటే చాలా కష్టపడాలని, నేటి విద్యార్థులు ఎనిమిదో తరగతి నుంచే ఐఐటి పట్ల ఆసక్తిని పెంచుకోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంకా అనేక విషయాలలో కూడా ఆసక్తి కనబరచాలని, జీవితంలో సాహసాలు చేయడానికి ప్రయత్నించాలని కూడా గూగుల్ సీఈఓ చెప్పారు.
గూగుల్ లో ఉద్యోగం రాదనే అనుకున్నా..
గూగుల్ సంస్థలో ఉద్యోగం సాధించడం ఎలా? అని ఓ విద్యార్థి ప్రశ్నించగా... తనకు గూగుల్ లో ఇంటర్వ్యూ ఏప్రిల్ 1న జరిగిందని, దీంతో తనకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కుదరలేదని, ఏప్రిల్ ఫూల్ గా భావించానని సుందర్ పిచాయ్ చెప్పారు.
గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ తనను ఇంటర్వ్యూ చేయలేదని, ఆయన ఇంటర్వ్యూ చేయని తొలి ఉద్యోగుల్లో తానూ ఒకడినని.. బహుశా అందుకే గూగుల్ లో తనకు ఉద్యోగం వచ్చి ఉంటుందని పిచాయ్ అన్నప్పుడు నవ్వులు వెల్లివిరిశాయి.
ఐఐటి ఖరగ్ పూర్ ను గూగుల్ డూడుల్ గా చూడొచ్చా అని మరో విద్యార్థి ప్రశ్నించగా.. అవకాశాలు తక్కువే కానీ... తమ టీంకు మెయిల్ పెట్టమని సూచించారు. త్వరలోనే ఖరగ్ పూర్ లో గూగుల్ క్యాంపస్ ప్రారభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
1993లో ఐఐటి ఖరగ్ పూర్ లో లోహ శోధన ఇంజనీరింగ్, బిజినెస్ వార్టన్ స్కూల్ నుంచి ఎంబిఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్న పిచాయ్ 2004లో గూగుల్ సంస్థలో చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా నియమితులయ్యారు.