ఆ ఇద్దరికీ ఒకే ఖాతా: ఎస్బీఐలో వింత! ‘నాకేం తెలుసు.. ప్రధాని మోడీ డబ్బులు వేస్తున్నారనుకున్నా’
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి తన డబ్బును పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన ఖాతాలో వచ్చిన డబ్బును ఓ వ్యక్తి తన అవసరాలకు వాడుకున్నాడు. అయితే, ఆ డబ్బు తన ఖాతాలోకి ఎలా వస్తుందో తెలియకున్నా.. అతడు ప్రధాని నరేంద్ర మోడీనే తన ఖాతాలో వేస్తున్నాడని అనుకోవడం గమనార్హం.
ఇద్దరికీ ఒకే ఖాతా నెంబర్..
వివరాల్లోకి వెళితే.. భింద్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో రురై గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్, రోని గ్రామానికి చెందిన హుకుమ్ సింగ్ అనే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు తమ ఖాతాలను తెరిచారు. ఇద్దరి పేర్లు కూడా ఒకేలా ఉండటంతో ఆ ఇద్దరికీ పొరపాటున ఒకే బ్యాంకు ఖాతా నెంబరును ఇచ్చారు అధికారులు.
డబ్బులు వాడేసుకున్నాడు..
ఈ క్రమంలో ఒక హుకుమ్ సింగ్ తన ఖాతాలో వేసుకుంటున్న డబ్బును.. మరో హుకుమ్ తన అవసరాలకు వాడుకున్నాడు. తన ఖాతాలో నగదు ఎలా వస్తుందో తెలియని హుకుమ్.. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటున్నారనుకున్నాడు. అదే ఆలోచనతో తన ఖాతా నుంచి ఆరు నెలల కాలంలో దాదాపు రూ. 89వేల వరకు డ్రా చేసుకున్నాడు.
డబ్బులు లేకపోవడంతో...
ఇక డబ్బులు జమ చేసిన హుకుమ్ సింగ్ తన ఖాతా నుంచి డబ్బు డ్రా చేసుకుందామని ప్రయత్నించగా.. అతని ఖాతాలో కేవలం రూ. 35వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇదేమంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు హుకుమ్ సింగ్. దీంతో బ్యాంకు అధికారులు తమ తప్పును తెలుసుకున్నారు.
ప్రధాని మోడీ వేస్తున్నారని..
ఈ విషయంపై హుకుమ్ సింగ్ను ప్రశ్నించగా.. ‘ప్రధాని నరేంద్ర మోడీ నా ఖాతాలో డబ్బులు వేస్తున్నారనుకున్నాను. అందుకే వాటిని వినియోగించుకున్నా' అని అతడు అమాయకంగా సమాధానం చెప్పడంతో బ్యాంకు అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
నా డబ్బులు నాకు కావాలంటూ..
ఇద్దరు వ్యక్తులకు ఒకే ఖాతా నెంబర్ ఎలా కేటాయించడం జరిగిందని విచారణ చేపట్టారు అధికారులు. అయితే, తన డబ్బు మాత్రం తనకు కావాలంటూ డబ్బులు కోల్పోయిన హుకుమ్ సింగ్ బ్యాంకు అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో బ్యాంకు అధికారులు ఆ పనిలో పడ్డారు.