Disha case encounter: నిర్భయ కేసులో అలాంటి ఆలోచన రాలేదని ఢిల్లీ మాజీ సీపీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీరజ్ కుమార్ గతంలో నిర్భయ అత్యాచారం, హత్య కేసును పర్యవేక్షించారు.
Disha case encounter: గర్వంగా ఉంది, నిబద్ధత గల అధికారి: సీపీ సజ్జనార్ సోదరుడు
ఆ ఆలోచన రాలేదు..
‘నిర్భయ ఘటన సమయంలోనూ మాపై చాలా ఒత్తిడి వచ్చింది. కానీ, నిందితులను చంపేయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఆకలిగా ఉన్న సింహాలకు నిందితులను వదిలిపెట్టండి అంటూ మాకు చాలా సందేశాలు వచ్చాయి. కానీ, మేం చట్టాన్ని అనుసరించాం' అని నీరజ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సరైన రీతిలోనే పోలీసులు స్పందించారు..
హైదరాబాద్ ఘటనలో పోలీసులు సరైన రీతిలోనే స్పందించారని ఆయన అన్నారు. లేదంటే నిందితులు అక్కడ్నుంచి పారిపోతే.. మళ్లీ దొరకడం కస్టతరమయ్యేదని నీరజ్ తెలిపారు. నిందితులు పారిపోతే మళ్లీ పోలీసుల సామర్థ్యంపై ప్రశ్నలు రేకెత్తేవని ఆయన అన్నారు.
నిర్భయ ఘటన దోషులకు క్షమాభిక్షకు నో..
2012, డిసెంబర్లో దేశ రాజధానిలో 23ఏళ్ల ప్యారామెడిక్ విద్యార్థి(నిర్భయ)నిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఆరుగురిని దోషులుగా గుర్తించారు. వారిలో రామ్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మిగితా ఐదుగురిలో ఒకరు మైనర్ కావడంతో.. మూడేళ్ల తర్వాత అతను విడుదలయ్యాడు. మిగితా నలుగురు దోషుల్ని జైళ్లలో ఉంచారు. ఇప్పటికీ వారికి శిక్ష అమలుకాకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత దారుణానికి పాల్పడిన ఐదుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనను ఉరిశిక్ష నుంచి తప్పించి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు విన్నవించుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వంతోపాటు హోంమంత్రిత్వశాఖ అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్షను ఇప్పటికే తిరస్కరించగా.. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తిరస్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఇలాంటి దారుణ ఘటనల్లో దోషులకు క్షమాభిక్ష పెట్టడం కుదరదని స్పష్టం చేశారు.