టెన్షన్ పెట్టిన మెట్రో రైల్.. మధ్యలో నిలిపివేత! ఇరుక్కుపోయిన ప్రయాణికులు..
ఢిల్లీ మెట్రోలో సాంకేతిక లోపాలు చాలా రెగ్యులర్గా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా గుర్గావ్ నుంచి ఢిల్లీని కలిపే మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మెట్రో సేవలు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో ఇరుక్కుపోయారు. కొందరు మెట్రో స్టేషన్ల కింద తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక పరిస్థితిని గమనించిన మెట్రో సిబ్బంది మరమ్మత్తులు చేసేందుకు పరుగులు తీశారు.
సాంకేతిక సమస్యతో కొన్ని గంటల పాటు నిలిచిన మెట్రో సేవలు
మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. స్టేషన్ కింద ఉన్న వారైతే ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. ఇతర ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూశారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యాహ్నం 1:30 గంటల వరకు గుర్గావ్ - ఢిల్లీలను కలిపే మెట్రో రూట్లో సేవలు నిలిచిపోయాయి. ఇది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దృష్టికి రాగానే రవాణా శాఖ మంత్రిని అలర్ట్ చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ ఇవ్వాలని తాను కోరినట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఓవర్ హెడ్ వైర్లో తలెత్తిన సాంకేతిక సమస్య
ఇదిలా ఉంటే మెట్రో సేవలు కుతూబ్ మినార్ నుంచి ఛత్తర్పూర్కు అందుబాటులోకి వచ్చాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. మరో లైనులో నిలిచిపోయిన మెట్రో రైలును మరికాసేపట్లో తొలగించి.. సేవలను పునరుద్ధరిస్తామని మరో ట్వీట్లో పేర్కొన్నారు. సుల్తాన్పూర్ స్టేషన్లో ఓవర్హెడ్ వైర్లో సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో ఎల్లోలైన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. తాత్కాలికంగా హుడా సిటీ సెంటర్, సుల్తాన్ పూర్, సమయ్పూర్ బదిలి, కుతూబ్ మినార్లకు నడుపుతున్నామని చెప్పారు. సాధారణంగా ఉదయం వేళల్లో మెట్రో స్టేషన్లు రద్దీగా ఉంటాయి. ఆ సమయంలో సేవలు నిలిచిపోయాయి. ఇక ఆగిపోయిన మెట్రో రైళ్లలో ప్రయాణికులను కిందకు దించివేశారు.
త్రీవ ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
కొందరు ప్రయాణికులు దిగి ట్రాక్ పై నడుచుకుంటూ కుతుబ్ మినార్ స్టేషన్కు చేరుకోగా మరికొందరు ప్రయాణికులు రైలులోనే ఉండి ఎయిర్ కండీషన్ వేయాలంటూ ట్వీట్స్ చేశారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు, పిల్లల తల్లులు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు అలానే ఎండలో నడుచుకుంటూ వెళ్లిపోయారు.మెట్రో సేవలు నిలిచిపోయాయన్న సంగతి తెలుసుకున్న క్యాబ్లు ఇతర ప్రైవేట్ వాహనదారులు తమ చార్జీలను అమాంతంగా పెంచేసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక వాహనదారులు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాంకేతిక సమస్య తలెత్తిన రూట్లో రోజుకు 8 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజుకు 30 లక్షలుగా ఉంది.