పారికర్కు కేంద్ర కేబినెట్ నివాళి, సాయంత్రం మిరామర్ బీచ్లో అంత్యక్రియలు
పనాజీ: మనోహర్ పారికర్కు కేంద్ర కేబినెట్ సోమవారం నివాళులర్పించింది. కేంద్రమంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు పనాజీకి రానున్నారు. ఈరోజు సాయంత్రం పనాజీలోని మిరామర్ బీచ్లో పారికర్ అంత్యక్రియలు జరగనున్నాయి. పారికర్ భౌతికకాయానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నివాళులర్పించారు. కంఫాల్లో ప్రజల సందర్శనార్ధం పారికర్ పార్థివదేహాన్ని ఉంచారు. ఆయనను చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు.
అనారోగ్యంతో కన్నుమూసిన పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సైనిక లాంఛనాలతో నిర్వహిస్తారు. ఈ మేరకు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కేంద్ర హోంశాఖ.. రక్షణ శాఖను కోరింది. మిరామర్ బీచ్లో గోవా తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కుటుంబం, రాజకీయాలు, ఆరెస్సెస్: ఎమ్మెల్యే అయిన తొలి ఐఐటియన్, ఎవరీ మనోహర్ పారికర్?
సాయంత్రం నాలుగు గంటలకు మనోహర్ పారికర్ అంతిమయాత్ర ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు చెప్పారు. ఐదు గంటలకు మిరామర్ బీచ్లో అంతిమ సంస్కారాలు జరుగుతాయన్నారు. మనోహర్ పారికర్ అంత్యక్రియలకు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. గతకొంతకాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్న మనోహర్ పారికర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాలుగుసార్లు గోవా సీఎంగా, మూడేళ్లపాటు రక్షణశాఖ మంత్రిగా సేవలు అందించారు. నిరాడంబరత, నిజాయతీకి నిలువుటద్దంగా ప్రశంసలు అందుకున్నారు.