నాటి ప్రభుత్వంవల్లే చైనా యుద్ధంలో ఓటమి: సొంత పార్టీకి పంజాబ్ సీఎం షాక్, కారణాలు చెప్పారు
న్యూఢిల్లీ: 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓడిపోవడానికి నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అలసత్వమేనని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన ఆయుధ సంపత్తిని కూడా సమకూర్చలేదని మండిపడ్డారు.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదే పార్టీకి చెందిన అమరీందర్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమరీందర్ సింగ్ మాజీ సైనికాధికారి కూడా. ఆయన చండీగఢ్లో జరుగుతున్న సైనిక సాహిత్య ఉత్సవంలో మాట్లాడారు.
నాటి ప్రభుత్వం అలసత్వానికి తోడు
నాటి ప్రభుత్వ విధానం వల్లే చైనాతో జరిగిన ఆ యుద్ధంలో అవమానకర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అమరీందర్ సింగ్ అన్నారు. నిఘా వైఫల్యం కూడా దీనికి తోడయిందని తెలిపారు. సరైన సన్నాహాలు లేకుండా యుద్ధానికి ప్రభుత్వం వెళ్లిందన్నారు.
చైనా దురాక్రమణపై సంకేతాలు ఉన్నప్పటికీ
చైనా దురాక్రమణకు దిగబోతోందన్న విస్పష్ట సంకేతాలు ఉన్నప్పటికీ వాటిని భారత నాయకత్వం విశ్వసించలేదని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నాటి వాతావరణం మొత్తం తేలిగ్గా తీసుకునే ధోరణిలో ఉందన్నారు. నాటి రాజకీయ పెద్దలు తమకు నచ్చినవారిని కీలక హోదాల్లో కూర్చోబెట్టారన్నారు.
సైనికులు నీరు, ఉప్పుతో మనుగడ సాగించారు
నాడు భారత సైన్యానికి సరైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేదని అమరీందర్ సింగ్ అన్నారు. సరకులు, చలిని తట్టుకోవడానికి వేడి దుస్తులనూ ఇవ్వలేదన్నారు. ఒక దశలో సైనికులు నీరు, ఉప్పుతో మనుగడ సాగించారన్నారు. నాటి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు.
మళ్లీ దూకుడు
దేశ తూర్పు సరిహద్దుల్లో మళ్లీ దూకుడు చర్యలు కనిపిస్తున్న నేపథ్యంలో మన సైనిక బలగాలు పూర్తిస్థాయి సన్నద్ధతను కలిగి ఉండేలా ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని అమరీందర్ అన్నారు. రెండు దేశాల సైన్యాల మధ్య సరైన అవగాహన ఉంటే యుద్ధాలను నివారించొచ్చని మాజీ సైన్యాధిపతి విపి మాలిక్ వ్యాఖ్యానించారు.