మెమన్ ఉరితీత: చంపేస్తామంటూ జడ్జికి బెదిరింపు లేఖ
న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయనకు బెదిరింపు లేఖ అందింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆకాశరామన్న ఉత్తరం ఒకటి న్యాయమూర్తికి వచ్చిన విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
1993లో జరిగిన ముంబై పేలుళ్ల కేసును విచారించిన టాడా కోర్టు మెమన్తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. అనంతరం దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. తన ఉరిశిక్ష ఖరారుపై చివరి క్షణంలో యాకుబ్ మెమన్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లను సుప్రీంకోర్టులో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.
అంతేకాదు అదేరోజు రాత్రి జరిగిన విచారణలో యాకుబ్ మెమన్కు ఉరి సరైందేనంటూ జస్టిస్ దీపక్ మిశ్రా సంచలన తీర్పు కూడా చెప్పారు. దీంతో జులై 30న ఉదయం మెమన్ను నాగ్పూర్లోని సెంట్రల్ జైల్లో ఉరిశిక్షను అమలు చేశారు. ఉరిశిక్ష అనంతరం జస్టిస్ మిశ్రాతో పాటు ధర్మాసనంలో ఉన్న మరో ఇద్దరు న్యాయమూర్తులకు కూడా భద్రతను పెంచారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగుల నుంచి జస్టిస్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది. ''మీరు ఎంత భద్రత కల్పించుకున్నా సరే.. మేం మిమ్మల్ని చంపి తీరుతాం'' అని ఆ లేఖలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయన ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. జస్టిస్ మిశ్రా, జస్టిస్ అమితవ్ రాయ్, జస్టిస్ ప్రఫుల్ల పంత్ ముగ్గురికి భద్రత పెంచారు. ఈ బెదిరింపు లేఖ వెనుక దావూద్ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి.
ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్ మెమన్ (యాకూబ్ సోదరుడు), దావూద్ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. యాకుబ్ మెమన్ ఉరితీతకు కొన్ని నిమిషాల ముందు టైగర్ మెమన్ ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి.