గుర్తు తెలియని నెంబర్ నుండి మోడీపై త్రెట్ మెసేజ్
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేయాలంటూ జార్ఖండ్లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుండి వచ్చిన సందేశం (ఎస్సెమ్మెస్) రాష్ట్ర పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాంచీకి చెందిన అమరేశ్ కుమార్ మొబైల్కు మోడీకో కో మర్ దో అంటూ ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఎస్సెమ్మెస్ వచ్చింది. దానిని చూసి హడలిపోయిన అమరేశ్, వెనువెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
దీంతో పోలీసులు ఆ సందేశం వచ్చిన మొబైల్ ఎవరిది, సదరు వ్యక్తి ఎక్కడున్నాడన్న వివరాలపై ఆరా తీస్తున్నారు. మోడీ పర్యటనలో ఏ చిన్న పొరపాటు కూడా జరగరాదన్న భావనతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. మెసేజ్ పంపిన గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, నరేంద్ర మోడీ జార్ఖండ్లో శుక్రవారం రెండు ర్యాలీల్లో పాల్గొననున్నారు. పాలమౌలోని దల్తోన్ గంజ్, చంద్వా ప్రాంతాలలో మోడీ పర్యటించనున్నారు. వచ్చే మంగళవారం జార్ఖండ్లో మొదటి దఫా ఎన్నికలు జరగనున్నాయి. త్రెట్ సందేశం విషయమై డీజీపీ మాట్లాడుతూ.. దీనిని పోలీసులు సీరియస్గా తీసుకున్నారని తెలిపారు.