మహారాష్ట్రకు మహా ముప్పు .. ఒకపక్క కరోనా .. మరోపక్క దూసుకొస్తున్న నిసర్గ తుఫాను
మహారాష్ట్రకు మహా ప్రమాదం పొంచి ఉంది. పెనుముప్పు మహారాష్ట్ర వైపు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం అది నిసర్గ తుఫానుగా మారింది. ఇది మహారాష్ట్ర దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పుడు మహారాష్ట్ర వణికిపోతోంది.
Recommended Video
ఇండియాలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు: గడచిన 24 గంటల్లో 8392 కొత్త కేసులతో రికార్డు
మహారాష్ట్రను పట్టి పీడిస్తున్న కరోనా
గత రెండు నెలలుగా మహారాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. భారత దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రస్తుతం ఉంది. అంతేకాదు భారతదేశంలో ఎక్కువ కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. ఇక ముంబై ప్రపంచంలోనే వేగంగా అత్యధిక కేసులు నమోదవుతున్న నగరంగా, కరోనాకు హాట్ స్పాట్ గా ఉంది అంటే మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
కరోనా సంక్షోభంలో మరో ఉపద్రవం .. నిసర్గ తుఫాను
ఒక వైపు కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకుంది. ఇక ఈ సమయంలో కరోనా నుంచి బయటపడడానికి మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. కానీ కరోనా మాత్రం కంట్రోల్ లోకి రావడం లేదు. ఇదే సమయంలో ఊహించని విపత్తులా మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు నిసర్గ తుఫాన్ మహారాష్ట్రను తాకుతుంది అన్న వాతావరణ శాఖ హెచ్చరిక మహారాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరాడనివ్వడం లేదు.
రానున్న 24 గంటల్లో మహారాష్ట్ర , గుజరాత్ లలో తీరం దాటే అవకాశం
రాబోయే 48 గంటల్లో నిసర్గ తుఫాను మహారాష్ట్ర, గుజరాత్ ల తీరం దాటే అవకాశం ఉన్నట్లు గా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. రాబోయే 48 గంటల పాటు మహారాష్ట్ర ప్రజలు తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని అటు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో 110 నుండి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
జూన్ 3 సాయంత్రం వరకు తీరం దాటనున్న నిసర్గ తుఫాను
భారతదేశ తూర్పు తీరంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రం మరియు లక్షద్వీప్ ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన తుఫాను జూన్ 1 నాటికి పంజిమ్ (గోవా) కి 360 కిలోమీటర్ల దూరంలో, ముంబైకి (మహారాష్ట్ర) 670 కిలోమీటర్ల నైరుతి దిశలో మరియు సూరత్ (గుజరాత్) కి 900 కిలోమీటర్ల నైరుతి దిశలో ఉంది. ఇది జూన్ 3 సాయంత్రం హరిహరేశ్వర్ (రాయ్గడ్, మహారాష్ట్ర) మరియు డామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ తీరాలను దాటుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. దీని ప్రభావం వల్ల జూన్ 3 నుండి కొంకణ్ మరియు గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 3-4 తేదీలలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి.
కరోనాతో కుదేలైన మహాకు నిసర్గ తుఫానుతో పెను ముప్పు
మొన్నటికి మొన్న అంఫన్ తుఫాను పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. కరోనా కంటే ఎక్కువ నష్టం తుఫాన్ వల్లనే వాటిల్లినట్లు గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు అంటే తుఫాను ఎంతగా నష్టం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం అసలే కరోనాతో కుదేలైన మహారాష్ట్ర, ఇప్పుడు తుఫాన్ భయంతో వణికిపోతోంది.