బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచార యత్నం.. కామాంధుడి నాలుక కొరికి తప్పించుకున్న మోడల్..
జైపూర్ : బొమ్మతుపాకీతో బెదిరించి ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె సమయస్పూర్తితో వ్యవహరించడంతో గండం నుంచి గట్టెక్కింది. దుండగుల్ని గాయపరిచి పోలీసులను ఆశ్రయించింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.
రాజస్థాన్ జైపూర్కు చెందిన 21 ఏళ్ల యువతి చదువుకుంటూ మోడలింగ్ చేస్తోంది. శుక్రవారం రాత్రి ఫ్రెండ్ బర్త్ డే ఉండటంతో అక్కడికి వెళ్లింది. అర్థరాత్రి 1.30గంటల సమయంలో తిరిగి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్లో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉండటంతో కారు ఎక్కేందుకు తటపటాయించింది. డ్రైవర్ నమ్మబలకడంతో క్యాబ్లో ఎక్కింది.
అర్థరాత్రి సమయంలో యువతి ఒంటరిగా ఉండటంతో క్యాబ్ డ్రైవర్తో పాటు అతని స్నేహితునిలోని కామాంధులు నిద్ర లేచారు. తమ వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన యువతి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి నాలుక కొరికేసింది. దీంతో ఆ దుర్మార్గుడు గిలగిలలాడుతుండటంతో అదే అదునుగా తప్పించుకుంది.
కామాంధుల బారి నుంచి తప్పించుకున్న యువతి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోన్ నెంబర్కు ఆధారంగా ఎక్కడున్నాడన్న సమాచారం తెలుసుకుని క్యాబ్ డ్రైవర్ సురేశ్ కుమార్ను అరెస్ట్ చేశారు. యువతి కొరకడంతో గాయాలపాలైన మరో నిందితుడు సచిన్ శర్మను తెల్లవారు జామున ఓ హాస్పిటిల్లో అదుపులోకి తీసుకున్నారు. యువతి ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 342 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.