మూడెకరాల శ్మశానం ఫుల్... మరో వారం దాటితే చేతులెత్తేయడమే... ఢిల్లీలో ఇదీ పరిస్థితి...
దేశ రాజధాని ఢిల్లీని కరోనా కబళిస్తోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు,పదుల సంఖ్యలో నమోదవుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే... మున్ముందు కోవిడ్ 19 మృతులను ఖననం చేసేందుకు ఢిల్లీలో శ్మశానాలు కూడా సరిపోవేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు సమీపంలో ఉన్న ఓ కబరస్తాన్ ఇప్పటికే దాదాపుగా నిండిపోయింది.
మరో వారం రోజుల్లో శ్మశానం ఫుల్... ఆ తర్వాత..?
సెంట్రల్ ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు సమీపంలో ఉన్న ఓ కబరస్తాన్లో ముస్లిం మతానికి చెందిన కోవిడ్ 19 మృతులను ఖననం చేస్తున్నారు. మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శ్మశానం ఇప్పటికే 75శాతం నిండిపోయింది. దీంతో కబరస్తాన్ కమిటీ ఆందోళన చెందుతోంది. మహా అయితే మరో 100 మృతదేహాలకు మించి ఇక్కడ ఖననం చేయలేమని చెబుతోంది. ప్రస్తుతం ప్రతీరోజూ 10 నుంచి 12 మృతదేహాలు వస్తున్నాయని... పరిస్థితి ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో కబరస్తాన్ నిండిపోతుందని కమిటీ పేర్కొంది. ఆ తర్వాత ఎలా అన్నది తమకేమీ తోచట్లేదని తెలిపింది.
ఆ 4 ఆస్పత్రుల నుంచే ఎక్కువగా...
కబరస్తాన్ను పొడగించేందుకు మావద్ద స్థలం లేదు. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం మాకు మరికొంత స్థలాన్ని ఇవ్వాలి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశాం.' అని కబరస్తాన్ కమిటీ సభ్యులు షమీ మహమ్మద్ తెలిపారు. ప్రతీరోజూ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడికి కోవిడ్ 19 మృతదేహాలు వస్తున్నాయని... ఇందులో లోక్ నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రి(LNJP),సఫ్దర్జంగ్ ఆస్పత్రి,రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి,ఎయిమ్స్ ఆస్పత్రుల నుంచే ఎక్కువగా మృతదేహాలు వస్తున్నట్టు చెప్పారు.
ఒకరోజు 15 కంటే ఎక్కువ పూడ్చట్లేదు...
'మొదట్లో ప్రతీరోజూ 2,3 కోవిడ్ 19 మృతదేహాలు వచ్చేవి. ఆ తర్వాత రోజుకు ఆరు మృతదేహాలు వచ్చేవి. కొద్దిరోజులకు 11-15 మృతదేహాలు రావడం మొదలైంది. ఒకరోజులో మేము 15 కంటే ఎక్కువ మృతదేహాలను పూడ్చలేము. ఇక్కడున్న ఎండ కారణంగా అంతకుమించి మావల్ల కావట్లేదు. కనీసం ఇక్కడ నిలువ నీడ కూడా లేదు. కాబట్టి 15 కంటే ఎక్కువ మృతదేహాలు వస్తే తిరస్కరిస్తున్నాం. ఆ మృతదేహాలను మరుసటిరోజు పంపించమని ఆస్పత్రులకు చెబుతున్నాం.' అని వసీమ్ అనే ఓ ఇమామ్ తెలిపారు.
కనీస వసతులు లేక ఇబ్బందులు...
'మాకు ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. ఒక శవాన్ని పూడ్చాక.. కాసేపు సేద తీరుదామన్నా.. ఎక్కడా నీడ లేదు. ఇంటికి వెళ్లలేము. కాబట్టి ఇదే ఎండలో ఇక్కడే ఓ చెట్టు కింద కూర్చుంటున్నాం. మృతదేహాలు వచ్చేంతవరకూ అక్కడే ఎదురుచూస్తూ కూర్చోవాలి. కనీసం ఎండ తగలకుండా ఇక్కడేదైనా ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవట్లేదు.' అని ఆ కబరస్తాన్ నిర్వాహకుడు తెలిపారు. ఇక అంత్యక్రియలకు సంబంధించి... మృతదేహాలకు స్నానం చేయించడం,కఫన్ చుట్టడం.. ఇవేవీ లేకుండానే ఖననం చేస్తున్నామని చెప్పారు. గత రెండున్నర నెలల నుంచి తాము ఇంటికి కూడా వెళ్లట్లేదని... వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నామని చెప్పారు. మొత్తం మీద కరోనా పేషెంట్లతో అటు ఆస్పత్రులు... మృతదేహాలతో ఇటు శ్మశానాలు రెండూ నిండిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.