"గోమాతాకీ జై అంటారా లేదా": 25 మందిని కట్టేసి చితకబాదిన భజరంగ్దళ్ కార్యకర్తలు
"గోమాతాకీ జై అంటారా లేదా" అని బెదిరిస్తూ 25 మందిని కట్టేసి చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఖంద్వా జిల్లాలో గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం రావడంతో 25 మందిని భజరంగ్దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం ఆ 25 మందిని తాడుతో కట్టేసినట్లు పోలీసులు తెలిపారు. వినోద్ కిషన్లాల్, రాజేష్ వర్మ, ప్రిన్స్ మెహతా అనే ముగ్గురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గోవులను రవాణా చేస్తున్న వారిని పట్టుకుని కట్టేసి చితకబాదారని పోలీసులు తెలిపారు. గ్రామస్తుల సహాయంతో ఈ 25 మందిని సన్వాలిఖేదా గ్రామం నుంచి ఖాల్వా పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించారని చెప్పిన పోలీసులు ... మధ్యలో వీరితో గుంజీలు తీయించడంతో పాటు గోమాతాకీ జై అని నినదించాల్సిందిగా బెదిరించారని చెప్పారు. ఇక అదుపులోకి తీసుకున్న ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 294, 323, 324, 342 , 34 కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హరిశంకర్ రావత్ తెలిపారు. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సహకరించిన గ్రామస్తులను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
#WATCH Several people tied with a rope and made to chant "Gau mata ki jai" in Khandwa, Madhya Pradesh on accusation of carrying cattle in their vehicles. (7.7.19) (Note - Abusive language) pic.twitter.com/5pbRZ4hNsR
— ANI (@ANI) July 7, 2019
గోవులను రవాణా చేస్తూ పట్టుబడిన ఈ 25 మందిలో ఏడుగురు ముస్లింలు ఉన్నారు. ఈ 25 మందిపై జంతుసంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పట్టుబడిన వాటిలో ఎద్దులు, దూడలు ఉన్నట్లు చెప్పిన పోలీసులు వాటిని గోశాలకు తరలించామని వెల్లడించారు. 25 మందిని హర్సూద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఇక అరెస్టు అయిన ముగ్గురు నిందితుల్లో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చలేదు.