పశువులను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముగ్గురు బంగ్లాదేశీయులను కొట్టిచంపారు
గౌహతి: పశువులను ఎత్తుకెళ్తున్న ముగ్గురు బంగ్లాదేశీయులను కొందరు గుంపుగా చేరి తీవ్రంగా కొట్టారు. దీంతో వారు మరణించారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పఠర్కండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగ్రిజన్ టీ ఎస్టేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉండటం గమనార్హం. మృతి చెందిన ముగ్గురితోపాటు వచ్చిన మరో నలుగురు పారిపోయారని తెలిపారు.
ఆవులను దొంగిలించే ఉద్దేశంతోనే ఆ బంగ్లాదేశీయులు సరిహద్దులను దాటారు. పశువులను దొంగిలించే క్రమంలో స్థానికులు ముగ్గురిని పట్టుకుని కొట్టి చంపారు. మరో నలుగురు పరారయ్యారు. ముగ్గుర్ని చంపిన వారి కోసం గాలిస్తున్నామని కరీంగంజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజిత్ కృష్ణ తెలిపారు.
బంగ్లాదేశ్లో తయారైన బిస్కెట్లు, బ్రెడ్ తోపాటు తాళ్లు, ఫెన్స్ కట్టర్స్, బ్యాగ్, వైర్లను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దు భద్రతా దళాల ద్వారా బంగ్లాదేశీ మృతుల దేహాలను ఆ దేశ అధికారులకు అందించనున్నట్లు చెప్పారు.
కాగా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి కరీంగంజ్ ప్రాంతంలో పశువులను ఎత్తుకెళ్లే ప్రక్రియ ఇక్కడ సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా కొందరు ఈ పశువుల దొంగలకు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.