ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం: నిండు సభలో మహిళా కార్పొరేటర్లు ఆత్మహత్యాయత్నం !
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర శాసన సభ్యుడు (కాంగ్రెస్), సినీ నిర్మాత మునిరత్న అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని, మహిళా నాయకులపై దురుసుగా ప్రవర్థిస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళా ప్రజాప్రతినిధు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరీ నగర శాసన సభ్యుడు (కాంగ్రెస్), సినీ నిర్మాత మునిరత్న అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని, మహిళా నాయకులపై దురుసుగా ప్రవర్థిస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు మహిళా ప్రజాప్రతినిధులు ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కార్పొరేటర్లు ఆశా, మమతా, మంజుల నిండు సభలో ఫినాయిల్ సేవించి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారని తెలిసింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఓ మంత్రికి సూచించారని సమాచారం.
ఎమ్మెల్యేతో విభేదాలు !
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్నంకు అదే పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ తో కొంత కాలంగా విభేదాలు తలెత్తాయని సమాచారం. బీబీఎంపీ సర్వసభ్య సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఆశా, బీజేపీ కార్పొరేటర్ మంజుల నారాయణస్వామి, మరో మహిళా కార్పొరేటర్ మమతా నలుపు రంగు చీరలు కట్టుకుని వచ్చారు.
మేయర్ చాంబర్ ముందే !
ఎమ్మెల్యే మునిరత్నం అనుచరులు మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తమ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని మంజుల నారాయణ స్వామి మేయర్ పధ్మావతి చాంబర్ ముందు ధర్నా చేస్తూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు !
అదే సమయంలో మంజుల నారాయణస్వామికి బీజేపీ కార్పొరేటర్లు ఆశా, మమతా మద్దతు తెలుపుతూ వారిద్దరూ ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. తరువాత ముగ్గరు కార్పొరేటర్లు వెంట తీసుకు వెళ్లిన ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
పార్టీలకు అతీతంగా మద్దతు !
విషయం గుర్తించిన సాటి కార్పొరేటర్లు, బీజేపీ శాసన సభ్యులు, జేడీఎస్ ఎమ్మెల్సీ మహిళా కార్పొరేటర్ల చేతుల్లో ఉన్న ఫినాయిల్ బాటిల్స్ లాగేశారు. ఈ విషయంపై పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ కార్పొరేటర్లు ముగ్గురు మహిళా కార్పొరేటర్లకు మద్దతుగా నిలిచారు.
సీఎం సిద్దూ సీరియస్ !
ఈ విషయం పెద్ద వివాదం కావడంతో సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారని తెలిసింది. సొంత పార్టీలోని ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మద్య ఏమిటి ఈ వివాదం అంటూ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ విషయం పూర్తి సమాచారం ఇవ్వాలని ఓ మంత్రికి సిద్దరామయ్య సూచించారని తెలిసింది.