దారుణం : ఆవుల్ని దొంగిలించారని ముగ్గుర్ని చంపేశారు..
బీహార్లో దారుణం జరిగింది. ఆవుల్ని దొంగలిస్తున్నారన్న నెపంతో ముగ్గురు వ్యక్తుల్ని కొందరు కొట్టి చంపారు. సరన్ జిల్లాలోని బనియాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పొరుగూరికి చెందిన ముగ్గురు వ్యక్తులు పశువుల దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో ఈ దాడులకు తెగబడ్డారు.
మృతి చెందిన ముగ్గురు శుక్రవారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో బనియాపూర్ గ్రామానికి వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న ట్రక్కులో ఆవులు ఉండటంతో స్థానికులు వారిని అడ్డగించారు. ముగ్గురిని బంధించి దారుణంగా కొట్టారు. వారి దెబ్బలు తాళలేక ముగ్గురు ఘటనాస్థలంలోనే కుప్పకూలారు. సమాచారం అందడంతో బనియాపూర్ గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. తీవ్రగాయాలపాలైన ముగ్గురిని ఛాప్రా హాస్పిటల్కు తరలించారు.
హాస్పిటల్కు తరలించిన ముగ్గురిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకుని హాస్పిటల్కు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలతో హాస్పిటల్ పరిసరాలు హృదయవిదారకంగా మారాయి. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతులపై గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల ప్రారంభంలో త్రిపురలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఆవుల్ని దొంగలిస్తున్నాడన్న కారణంతో దలై జిల్లాలోని ఓ గ్రామంలో 36 ఏళ్ల వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు.