3 బిగ్గెస్ట్ మిస్టెక్స్... కరోనాపై యుద్దంలో చేతులెత్తేస్తోన్న రాష్ట్రాలు...
దేశంలో కరోనా కేసుల సంఖ్య విజృంభిస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో యూకెని దాటి భారత్ మూడో స్థానానికి చేరుకుంది. జులై నెల నాటికి దేశంలో కేసుల సంఖ్య ఊహించుకోవడానికే వణుకు పుడుతోంది. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఇప్పటికీ టెస్టుల సంఖ్య పెరగకపోవడం,అరకొరా మెడికల్ వసతులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మూడు అతిపెద్ద తప్పిదాలకు పాల్పడుతున్నాయి.
Recommended Video
మొదటి తప్పు ఇదే..
చాలావరకు రాష్ట్రాలు ఇప్పటికీ చాలా తక్కువ మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నాయి. ఉదాహరణకు గుజరాత్నే తీసుకుంటే.. కరోనా కేసుల సంఖ్యలో ఆ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉండగా.. టెస్టుల సంఖ్యలో మాత్రం కింది నుంచి ఐదో స్థానంలో ఉంది. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాల్లో అగ్ర స్థానంలో ఉందని చెప్పుకునే రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలన్నీ ఆర్థికంగా బలహీనమైనవే. బీహార్,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,ఒడిశా ఆ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్లో ఒక మిలియన్ జనాభాకు 84 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. గుజరాత్ కంటే జార్ఖండ్,ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలు సైతం ఇంతకంటే మెరుగ్గానే టెస్టులు చేస్తుండటం గమనార్హం.
రెండో తప్పిదం...
కొన్ని రాష్ట్రాలు కరోనా సంబంధిత టెస్టులను తక్కువగా నిర్వహిస్తున్నాయి. టెస్టింగ్కి సంబంధించి రెండు ముఖ్యాంశాలను గమనించాలి. టెస్టింగ్ పాజిటివిటీ రేటు(TPR),ప్రతీ మిలియన్ జనాభాకు ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఈ రెండు అంశాలపై కేసుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఇవి రెండింటిని కలిపి చూస్తేనే కరోనాపై పోరులో ఆ రాష్ట్రం ఎలా వ్యవహరిస్తుందో కచ్చితంగా చెప్పగలం. ఈ విషయంలో మహారాష్ట్ర,గుజరాత్ రెండూ వెనుకబడే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ టెస్టింగ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండగా... డైలీ టెస్టుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఢిల్లీలోనూ టీపీఆర్(12శాతం) రేటు ఎక్కువగా ఉండగా.. గత 7 రోజుల్లో ఒక మిలియన్ జనాభాకు కేవలం 270 టెస్టులే నిర్వహించడం గమనార్హం. అటు మహారాష్ట్ర గత వారం రోజుల్లో ఒక మిలియన్ జనాభాకు 111 టెస్టులు మాత్రమే నిర్వహించింది.
గోవా,జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో
గోవా,జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో టీపీఆర్ తక్కువగా ఉన్నప్పికీ.. టెస్టింగ్ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. గత 7 రోజుల్లో గోవాలో ఒక మిలియన్ జనాభాకు 990 టెస్టులు నిర్వహించగా.. అక్కడ టీపీఆర్ 1.05శాతంగా ఉంది. అటు జమ్మూకశ్మీర్లో 1.84శాతం టీపీఆర్ ఉండగా.. ఒక మిలియన్ జనాభాకు 571 టెస్టులు నిర్వహిస్తున్నారు.
మూడో తప్పిదం...
మే నెల మధ్య నుంచి దాదాపుగా చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు టెస్టుల సంఖ్యను పెంచడం లేదు. ఢిల్లీ,గుజరాత్ రాష్ట్రాల్లో టీపీఆర్ ఎక్కువగా ఉన్న టెస్టుల సంఖ్యలో పెరుగుదల లేదు. అయితే మహారాష్ట్ర,తమిళనాడు ఇప్పుడు టెస్టుల సంఖ్యను పెంచాయి. ఈ రెండు రాష్ట్రాలు ప్రతీరోజూ సగటున ఒక మిలియన్ జనాభాకు 14వేల టెస్టులు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ,గుజరాత్ సగటు మాత్రం 6వేలకు తక్కువగానే ఉంది. జూన్ 9 నాటికి గుజరాత్ చేసిన మొత్తం కరోనా పరీక్షలు 2,61,587 కాగా ఢిల్లీ చేసిన పరీక్షలు 2,61,079. ఏదేమైనా దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నా.. టెస్టింగ్ సంఖ్య పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.