బరిలో ముగ్గురు.. మరి బాద్యతలు ఎవరికి..? బీజేపి అధ్యక్ష పదవిపై నలుగుతున్న అగ్రనేతలు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీకి కొత్త సారథి ఎవరన్న ప్రశ్న అదిష్టానం పెద్దలను తొలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. బీజేపీ బోర్డు నిబంధనల ప్రకారం జోడు పదవులు అనుభవించేందుకు వీల్లేదు. అదీగాక అమిత్ షా కీలకమైన హోం శాఖ బాధ్యతలు చేపట్టారు. దేశ అంతర్గత భద్రత వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉండి పార్టీపై దృష్టి సారించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ దశలో కమల దళపతిగా కొత్త వారిని ఎంపిక చేస్తారని గత కోన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అమిత్ షా, మోడీ మనసులో ఉన్న వారి పేరునే కమల దళపతిగా ప్రకటించే అవకాశం ఉంది.
కమల దళపతి ఎవరు..? రేసులో ముగ్గురు కీలక నేతలు..!!
ఇప్పుడు ఈ రేసులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వంలో గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జయ ప్రకాశ్ నడ్డా రేసులో ముందున్నారు. ఈయనకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో బీజేపీ అధ్యక్షుడిగా చేస్తారన్న ప్రచారం ఉంది. అందుకే ఈయనకు మంత్రి పదవి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా అమిత్ షా మాత్రం మార్గదర్శనం చేస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో జేపీ నడ్డాతోపాటు మరో ఇద్దరు బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారు. వీరిద్దరూ తెలుగువారే కావడం విశేషం.
దక్షిణ భారతదేశానికి ప్రాముఖ్యత..! మోదీ-షా మనసులో ఏముంది..?
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్ మాధవ్, మురళీధరరావు పేర్లు కూడా బీజేపీ అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో రామ్మాధవ్ అమిత్ షా, మోడీకి అత్యంత సన్నిహితుడు. జమ్మూకాశ్మీర్లో సంక్షోభం, చైనాలో వన్ బిల్ట్ వన్ రోడ్ సమస్యలు తలెత్తినప్పుడు చాకచక్యంగా పరిష్కరించారు. అలాగే ఇతర పార్టీల నేతలతోనే మంచి సంబంధాలు ఉన్నాయి. పొత్తుల విషయంలో కీలకంగా వ్యవహరించి మిత్రపక్షాలను కలుపుకొని వెళతారన్న పేరుంది. మురళీధరరావు మోడీ, షాలకు సన్నిహితుడిగా పేరు సాధించారు. పైగా వీరిద్దరూ దక్షిణాది వారు కావడం కలిసొచ్చే అంశంగా మారింది. ప్రస్తుతం బీజేపీకి ఉత్తరాది పార్టీ అన్న ముద్ర పడింది. మోడీ, షా కూడా ఉత్తర, పశ్చిమ భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దక్షిణాదిలో పాగా వేయడమే నెక్స్ట్ టార్గెట్..! అందుకు అనుగుణంగా బీజేపి నడుచుకుంటుందా...?
రానున్న అయిదేళ్లలో ఉత్తరాది పేరు పొగొట్టుకుని దక్షిణాదిలోనూ పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ సమీకరణాల దృష్ట్యా వీరికి పదవి దక్కవచ్చన్న ప్రచారం ఉంది. అయితే.. ఇదే సమయంలో రానున్న ఆరు నెలల కాలం బీజేపీ అత్యంత కీలకం కానుంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే బదులుగా మరో ఆరు నెలలపాటు అమిత్ షానే కొనసాగవచ్చన్న ప్రచారం కూడా పార్టీలో వినిపిస్తోంది. వాస్తవానికి బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా పదవి కాలం గత డిసెంబరుతోనే ముగిసింది.
పదవీకాలం ముగించుకున్న షా..! మరి పగ్గాలు ఎవరి చేతికి..?
సార్వత్రిక ఎన్నికలకు ముందు అధ్యక్షుడిని మార్చడం అంత శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో అమిత్ షా పదవి కాలం పార్టీ పొడిగించింది. మోడీ, షా నేతృత్వంలోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో ఆరు నెలల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానలో ఎన్నికలు ఉన్నాయి. దీని ముందు మార్చడం కంటే అవి అయ్యాక మార్చవచ్చన్న ప్రచారం కూడా ఉంది. అయితే.. షా మాత్రం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విషయం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్, విధేయత కార్డుపై జయ ప్రకాశ్ నడ్డాకు పదవి దక్కవచ్చన్నప్రచారం జోరుగా సాగుతోంది.