స్మార్ట్ ఫోన్ల కోసం తమ రక్తాన్ని అమ్ముకున్నారు!
లక్నో: యువతే కాదు, చిన్నారులు కూడా స్మార్ట్ ఫోన్లపై మోజు పెంచుకుంటున్నారు. అది ఎంత స్థాయి వరకు వెళ్లిందంటే.. స్మార్ట్ ఫోన్ కోసం వారు తమ రక్తాన్ని కూడా అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు. ఆందోళనను కలిగించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని చౌకా ప్రాంతానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు స్థానిక దుకాణాల్లో పనిచేస్తున్నారు. చాలా రోజుల నుంచి వారు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా.. డబ్బులు సరిపోవడం లేదు. దీంతో వారు స్థానిక పాథాలజీ క్లినిక్లో పనిచేస్తున్న గజిని అనే వ్యక్తిని సంప్రదించారు.
మీరు మీ రక్తం ఇస్తే ఒక్కొక్కరికీ రూ.500 ఇస్తారని చిన్నారులకు ఆశచూపాడతను. దీంతో ఆ అమాయకపు బాలురు తమ రక్తాన్ని అమ్ముకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లినిక్ నిర్వాహకులను, చిన్నారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
64 మంది ఈవ్ టీచర్ల అరెస్ట్
ముంబై: యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న 64మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారికి కొంత మొత్తంలో జరిమానా విధించి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదా ఐలాండ్, అక్సా బీచ్ వద్ద గల కొన్ని హోటళ్లలో కొంతమంది యువతీయువకులు జంటలుగా ఏర్పడి అసభ్యంగా ప్రవర్తిస్తూ తోటివారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు రిసార్టులపై దాడులు నిర్వహించి మొత్తం 64మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.1200 జరిమానా వేయడంతోపాటు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి నేరుగా కౌన్సెలింగ్ ఇప్పించి పంపించేశారు.