యూపీలో దారుణం: అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు ..బోరుబావిలో శవమై ప్రత్యక్షం
ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయిన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు ఓ బోరుబావిలో కనిపించాయి. ఈ ముగ్గురు చిన్నారులను ఆస్మా (8), అలిబా(7)అబ్దుల్లా(8)గా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళితే బులంద్షెహర్కు చెందిన ముగ్గురు చిన్నారులు శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. మృతులంతా ఒకరికొకరు బంధువులే అని పోలీసులు తెలిపారు. అయితే కుటుంబాల మధ్య గొడవలే హత్యకు దారితీసి ఉంటాయనే అనుమానం వ్యక్తం అవుతోందని పోలీసులు చెప్పారు.
శుక్రవారం సాయంత్రం చిన్నారులు ఆటాడుకుంటుండగా... ఒక్కసారిగా ముగ్గురూ అదృశ్యమయ్యారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారికోసం వెతికారు. ఆ తర్వాత బులంద్ షహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శనివారం ఉదయం ఆ ముగ్గురు చిన్నారుల మృతదేహాలు ఓ బోరుబావిలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు తల్లిదండ్రులు. మృతదేహాలు బులంద్ షహర్కు 15 కిలోమీటర్ల దూరంలో ధతురీ గ్రామంలో కనిపించాయి.
పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టంకు పంపారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సల్మాన్ను పట్టుకునేందుకు నాలుగు బృందాలు గాలిస్తున్నాయని ఎస్ఎస్పీ కొలాంచి చెప్పారు. అంతేకాదు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు గాను స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో వారి తప్పు ఉందని తేలితే వారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. నిందితుడిని కచ్చితంగా పట్టుకుంటామని అంతవరకు గ్రామస్తులు కాస్త సంయమనం పాటించాలని కోరారు