మంత్రి వర్గ విస్తరణకు డేట్ ఫిక్స్: రెబల్ ఎమ్మెల్యేల దెబ్బకు సీఎం, వేచి చూస్తున్న బీజేపీ లీడర్స్!
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారైయ్యింది. మంత్రి వర్గంలో చేరే ఎమ్మెల్యేల జాబీతాను ముఖ్యమంత్రి కుమారస్వామి సిద్దం చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. సీఎం కుమారస్వామి అధికారికంగా కొత్త మంత్రుల పేర్లు ప్రకటించవలసి ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామలింగా రెడ్డి, శిడ్లఘట్ట ఎమ్మెల్యే వి. మునియప్ప, కుష్టగి ఎమ్మెల్యే అమరేగౌడ లింగనగౌడ పాటిల్ బయ్యాపురలకు కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని సమాచారం.
కొత్త మంత్రులు
వి. మునియప్ప, అమరేగౌడ బయ్యాపుర మొదటిసారి మంత్రి వర్గంలో చేరుతున్నారు. రామలింగా రెడ్డి గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. మాజీ మంత్రి రామలింగా రెడ్డి అనుభవం మరోసారి ఉపయోగించుకోవడానికి ఆయన్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని సమాచారం.
రెబల్ ఎమ్మెల్యేలు
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నారు. చాల కాలంగా కాంగ్రెస్ పార్టీ మీద అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యే మహేష్ కుమటళ్లితో పాటు మరో ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తున్నారు.
మాజీ సీఎం దెబ్బ
మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మద్దతుదారులు. వి. మునియప్ప, అమరేగౌడ బయ్యాపురలకు మంత్రి పదువులు రావడంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది.
మంత్రి వర్గం వాయిదా !
ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం సిద్దరామయ్యకు సమకాలికులు. గత బుధవారం కొత్త మంత్రి వర్గ విస్తరణ జరగవలసి ఉంది. అయితే అనేక ఆనివార్య కారణాల వలన మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడింది. అయితే సోమవారం మంత్రి వర్గ విస్తరణ చెయ్యాలని సీఎం కుమారస్వామి నిర్ణయించారని తెలిసింది.
రహస్య సమావేశం
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు రమేష్ జారకిహోళి తన మద్దతుదారులతో రహస్యంగా సమావేశం అయ్యారు. రమేష్ జారకిహోళి రహస్య సమావేశానికి హాజరయ్యే ఎమ్మెల్యేల గురించి సమాచారం తెలుసుకున్న తరువాత మంత్రి వర్గ విస్తరణ చెయ్యాలని సీఎం కుమారస్వామి నిర్ణయించారని తెలిసింది. మొత్తం మీద మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని సంకీర్ణ ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.