అమానుషం.. 3 రోజుల పసికందుపై 20 కత్తిపోట్లు..
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మూడు రోజుల ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో విసిరేసి వెళ్లారు. ఆపై ఆ పసికందును కుక్కలు నోటకరిచి తీసుకెళ్తుండగా.. అటుగా వెళ్తున్న కొంతమంది యువకులు చూశారు. వెంటనే ఆ కుక్కలను తరిమికొట్టగా.. పసికందును అక్కడే వదిలేసి పారిపోయాయి.
తాము క్రికెట్ ఆడేందుకు వెళ్తుండగా.. మహిక్-తెబచద గ్రామాల మధ్య ఓచోట పసికందు ఏడవడాన్ని గుర్తించామని ఆ యువకులు తెలిపారు. ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్లి చూడగా.. ఓ పసికందును కుక్క నోటకరిచి తీసుకెళ్తున్నట్టు గుర్తించామన్నారు. వెంటనే రాళ్లతో దాన్ని తరిమికొట్టామని.. పసికందును అక్కడే వదిలేసి కుక్క పారిపోయిందని చెప్పారు. ఆపై పసికందు దగ్గరికి వెళ్లి చూడగా.. శరీరంపై 20 కత్తిపోట్లు గుర్తించామన్నారు. అనంతరం ఆ పసికందును స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆ పసికందు గాయాల నుంచి నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. పసికందు వెనుక భాగంలో దాదాపు 20 కత్తి గాయాలు ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు,చిన్నారి నోటిలోకి మట్టి వెళ్లడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. అయితే ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలిపెట్టి పోవడమే కాదు.. చంపేందుకు ప్రయత్నించారని ఆ గాయాలను చూస్తే తెలుస్తోందన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.