బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ? రేసులో బళ్లారి శ్రీరాములు!
బెంగళూరు: కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారా ? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కర్ణాటకలో బీజేపీని మరింత బలోపేతం చెయ్యాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఫార్ములాను కర్ణాటకలో అమలు చెయ్యాలని బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోందని సమాచారం.
బీజేపీకి వైఎస్ జగన్ దెబ్బ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఐదు మంది ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల వారికి న్యాయం చెయ్యడానికి ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తెర మీదకు తెచ్చారు. ఇప్పుడు వైఎస్ జగన్ ఫార్ములానే ఫాలో అవ్వడానికి బీజేపీ నాయకులు సిద్దం అయ్యారని తెలిసింది.
ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు !
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు కావాలని బీజేపీ హైకమాండ్ కు చెప్పామని, ఢిల్లీ పెద్దలు సోమవారం (ఆగస్టు 26) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చెయ్యడానికి ఉప ముఖ్యమంత్రి పదవులు కావాలని హై కమాండ్ కు చెప్పామని యడియూరప్ప ఆయన సన్నిహితులతో అన్నారని తెలిసింది. ఇంతకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి.
అసెంబ్లీలో పొర్న్ వీడియోలు !
ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో బెళగావి జిల్లాకు చెందిన లక్ష్మణ సవది ఉన్నారని వెలుగు చూసింది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో లక్ష్మణ సవది మంత్రిగా ఉన్నారు. అప్పట్లో మంత్రి పదవిలో ఉన్న లక్ష్మణ సవది అసెంబ్లీ (విధాన సౌధ)లో పొర్న్ వీడియోలు చేశారని వెలుగు చూడటంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అప్పట్లో లక్ష్మణ సవది ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో లక్ష్మణ ఎమ్మెల్యేగా గెలవలేదు. అయినా లక్ష్మణ సవదికి మంత్రి పదవి ఇచ్చారు.
సీఎం మనసులో ముగ్గురు
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ముగ్గురు సీనియర్ నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ కు మనవి చేశారని తెలిసింది. బీజేపీ మంత్రులు గోవింద కారజోళ, ఆర్. అశోక్, అరవింద లింబావలికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని సీఎం యడియూరప్ప ఢిల్లీ పెద్దలకు మనవి చేశారని సమాచారం.
రేసులో బళ్లారి శ్రీరాములు
ఉప ముఖ్యమంత్రి పదవుల రేసులో మంత్రులు బళ్లారి శ్రీరాములు, సీఎన్. అశ్వథ్ నారాయణ (బెంగళూరు) ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే బీజేపీ నాయకుడు బీఎల్. సంతోష్ తో హైకమాండ్ చర్చలు జరుపుతోందని తెలిసింది. ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరెవరికి ఇద్దాం ? అనే విషయంలో బీఎల్. సంతోష్ అభిప్రాయాలు తీసుకుంటున్నారని సమాచారం.
జూనియర్ కు ఎందుకు ?
గోవింద కారజోళ సీనియర్, ఆయనకు ఇంతకు ముందు మంత్రిగా అనుభవం ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. అశ్వథ్ నారాయణ చాల జూనియర్ అని, ఆయనకు భవిష్యత్తు ఉందని, ఇంతకు ముందు ఆయన మంత్రిగా పని చేసిన అనుభవం లేదని, అప్పుడే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకని కొందరు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
అమిత్ షా ఆలోచన !
లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయని హైకమాండ్ కు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని సమాచారం. మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి ? మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలి ? అనే విషయం అమిత్ షా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.