డేరా బాబాను తప్పించే యత్నం: ముగ్గురు అనుచరుల అరెస్ట్
అత్యాచారం కేసులో అరెస్టైన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)ను తప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో అరెస్టైన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)ను తప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 25న పంచకుల కోర్టు డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హింసాకాండకు దిగిన విషయం తెలిసిందే.
'డేరా'లో ఎన్నో ఘోరాలు: రియాల్టీషోలు!, కోట్లిచ్చిన భక్తుడి ఆత్మహత్య
ఈ క్రమంలోనే డేరాబాబాను పోలీసులు అరెస్టుచేయకుండా కాపాడేందుకు ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. డేరా అనుచరులు అల్లర్లపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. తాజాగా డేరా సచ్చా సౌదాకి చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు హర్యానా ఐజీ కేకేరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
'డేరాబాబా కోర్టు వచ్చే ముందే కుట్ర జరిగింది. న్యాయమూర్తి ఆయనను దోషిగా ప్రకటించగానే డేరాబాబా తన ఎర్రటి బ్యాగులో దుస్తులున్నాయనీ.. దాన్ని తీసుకురావాలంటూ సూచించారు. తాను దోషిగా తేలితే ఎర్రటి బ్యాగు లోపలికి తీసుకెళ్తారంటూ ముందుగానే బాబా తన శిష్యలకు చెప్పారు. ఆ మేరకే ఎర్రటి బ్యాగు తీసుకెళ్లగానే.. కోర్టు బయట ఉన్న డేరా అనుచరులు అల్లర్లు మొదలు పెట్టారు. బాబా చేసిన ప్రతి పని వెనుకా ఓ బలమైన అర్థాలున్నట్టు గుర్తించాం' అని ఐజీ వివరించారు.
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన గుర్మీత్ సింగ్ ప్రస్తుతం రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. డేరాను అడ్డాగా చేసుకుని ఆయన చేసిన అకృత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు డేరా ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో సంచలన విషయాలు, బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
డేరా బాబాకు భద్రత పెంపు
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హర్యానాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే జైల్లో గుర్మీత్కు 15 నుంచి 20 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారట. జైలు నుంచి విడుదలైన సోను పండిత్ అనే వ్యక్తి ఈ విషయాలను వెల్లడించాడు. తోటి ఖైదీల నుంచి గుర్మీత్ ప్రాణాలకు ముప్పు ఉండటంతోనే ఈ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పండిత్ తెలిపాడు.