బెంగళూరులో బైక్ అదుపుతప్పి ముగ్గురు ఇంజనీర్లు దుర్మరణం, మూడు రోజుల్లో నిశ్చితార్థం !
బెంగళూరు: బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ముగ్గురు ఇంజనీర్లు దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బైక్ లో ప్రయాణం చేస్తున్న ముగ్గురు ఇంజనీర్లు దుర్మరణం చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఒక ఇంజనీరు నిశ్చితార్థం ఇదే గురువారం జరగవలసి ఉంది.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు అభివృద్ది లిమిటెడ్ (కేఆర్ డీఎల్)లో ఉద్యోగం చేస్తున్న టీ. నరసీపుర నివాసి కార్తీక్ (29), హెచ్ఏఎల్ ఇంజనీరు అనీల్ (28), బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న చిక్కబళ్లాపుర నివాసి శ్రీనాథ్ (29) అనే ముగ్గురు యువకులు మరణించారని పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురిలో ఒకరి నిశ్చితార్థం ఇదే గురువారం జరగవలసి ఉందని, ఇంతలోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అన్నారు. కార్తీక్, అనీల్, శ్రీనాథ్ అనే ముగ్గురు యువకులు బెంగళూరులోని బసవేశ్వరనగరలోని పవిత్ర ప్యారడైజ్ హోటల్ దగ్గర నుంచి మాగడి రోడ్డులోని కేహెచ్ బీ కాలనీ వైపు బయలుదేరారు.
మార్గం మద్యలో సిద్దయ్య పురాణిక్ రోడ్డులో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొని అదే వేగంతో వెళ్లి విద్యుత్ స్థంభాన్ని డీకొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకుల తలలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారని విచారణలో వెలుగు చూసిందని డీసీపీ సౌమ్యలతా సోమవారం మీడియాకు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు యువకులు హెల్మెట్లు వేసుకోలేదని, వారి తలలకు తీవ్రగాయాలై మరణించారని పోలీసులు తెలిపారు.