గుజరాత్ పోరు: ఇది ఫక్కా.. ఆ మూడే కీలకం.. ఖా(మ్)ప్ ప్లస్ కుల సమీకరణాలు
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫలితాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. రెండు దశాబ్దాలుగా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుండగా, ఈసారి మాత్రం గట్టిపోటీని ఎదుర్కొంటున్నది. బీజేపీ ఓటమి లక్ష్యంగా ముగ్గురు బలమైన సామాజిక నేపథ్యం ఉన్న స్వతంత్ర భావాలు గల నాయకులు ప్రచారం సాగిస్తుండటం కాంగ్రెస్కు కలిసి వస్తున్నది. దీనికితోడు కుల సమీకరణాలు ఈసారి ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. ఆయా సామాజిక వర్గాల పట్ల అధికార పక్షం వైఖరి కీలకం కానున్నది.
ఇప్పటివరకు అన్ని వర్గాల మద్దతు కూడగట్టడం వల్లే గుజరాత్ రాష్ట్రంలో 'కమల వికాసం' సాధ్యమైందన్నది వాస్తవం. కానీ ఇటీవల ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో నిర్వహిస్తున్న సభలకు ప్రజలు పెద్దగా రాకపోవడం కమలనాథుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడు అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
తొలి నుంచి బీజేపీకే పాటిదార్ల మద్దతు.. యువత సారథ్యంలో పటేళ్లు
ఉపాధి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి బీజేపీ, కాంగ్రెస్ ఉపన్యాసాల్లో ఊదరగొడుతున్నా, వాటికన్నా కుల కోణం గుజరాత్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారింది. బలమైన సామాజిక వర్గాలనుంచి మద్దతు కూడగట్టడంలో బీజేపీ, కాంగ్రెస్ చాలా రోజుల ముందు నుంచే పోటీపడుతున్నాయి. వీరిలో పాటిదార్లు కీలకం. వీరు సాంప్రదాయకంగా బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నప్పటికీ, పాటిదార్లలోని నవతరం మొత్తం సామాజికవర్గాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆరుకోట్ల మంది జనాభా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో పాటిదార్లు 12శాతం ఉన్నారు. కాంగ్రెస్ ప్రవచిత ‘ఖామ్' ఫార్ములా ప్రకారం క్షత్రియులు 11 శాతం, హరిజనులు 7, ఆదివాసీలు 14, ముస్లింలు 9 శాతం జనాభా ఉన్నారు. ఈ నెలలో జరిగే ఎన్నికల్లో ఓబీసీలు 32 శాతం, క్షత్రియ, దళిత, ఆదివాసీలు కలిపి 21, అగ్రకులాల్లలో 21, పాటిదార్లు 18 శాతం మంది ఓటేయనున్నారు.
68 సెగ్మెంట్లలో ఠాకూర్లు, కోలీలు నిర్ణయాత్మకం
మొత్తం 182 శాసనసభ స్థానాల్లో 60చోట్ల గెలుపోటములను పాటిదార్లు ప్రభావితం చేయగలరు. ఇందులోని 52 అసెంబ్లీ నియోజకర్గాల్లో పాటిదార్ల జనాభానే ఎక్కువ. మరో 68 సెగ్మెంట్లలో ఠాకూర్లు, కోలీలు నిర్ణయాత్మకం కానున్నారు. గుజరాత్ ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా బలమైన ఈ కులాలను విస్మరించలేదు. 1980లో కాంగ్రెస్ ప్రయోగించిన క్షత్రియ - హరిజన (దళిత) - ఆదివాసీ - ముస్లిం (కేహెచ్ఏఎం) సమీకరణం ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది. 182 అసెంబ్లీ స్థానాలకు 141చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. 1985లో ఏకంగా 149 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్ర జనాభాలో 41శాతం ఈ నాలుగు వర్గాల వారే కావడంతో కేహెచ్ఏఎం మద్దతు కూడగట్టి పటేల్ సామాజికవర్గాన్ని అప్పట్లో కాంగ్రెస్ ఎదుర్కొన్నది. మాధవసింగ్ సోలంకి రెండు పర్యాయాలు సీఎం అయ్యారు. అదొక రికార్డు. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీ కూడా 140కి మించి స్థానాలను పొందలేదు. ఖామ్ ఫార్ములాను పునరుద్ధరించి దానికి పాటిదార్లను జతచేసిన నూతన సామాజిక కూటమిని ఖాప్ (కేహెచ్ఏపీ)గా కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
అన్ని వర్గాల మద్దతుతోనే కమల వికాసం ఇలా
గుజరాత్లో గడిచిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లవాటా గణనీయంగా ఏమీ పెరుగలేదు. 1995లో 42.5శాతం ఓట్లను సాధించిన బీజేపీ 2012నాటికి వాటిని 47.9శాతానికి పెంచుకోగలిగింది. ఓట్లవాటాలో పెద్దగా పెరుగదల లేకపోయినా, 20 ఏండ్లు బీజేపీ అక్కడ విజయం సాధిస్తూనే వచ్చింది. 2012 ఎన్నికల్లో 12మంది బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం ఐదువేల లోపే ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2002 నుంచి 2012 వరకు మూడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సామాజిక వర్గాల మద్దతును పొందగలిగింది. ప్రత్యేకించి కాడ్వా పటేళ్లలో 83 శాతం, లేవా పటేళ్లలో 67, ఉన్నత కులాల్లో 69, ఓబీసీల్లో 54, కోలీల్లో 53, క్షత్రియుల్లో 53, ఎస్సీల్లో 28, ఎస్టీల్లో 35 శాతం మంది ఓటర్లు బీజేపీకే ఓటేయడంతో ఏకఛత్రాధిపత్యంగా విజయం సాధించగలిగింది బీజేపీ. 2012 ఎన్నికల్లో అధికార బీజేపీ 116, కాంగ్రెస్ 16, కేశుభాయి పటేల్ సారథ్యంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ (జీపీపీ) రెండు, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ రెండేసీ స్థానాలు గెలుచుకున్నాయి. జనతాదళ్ యూ చోటు వాసవ మరో స్థానంలో గెలిచారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు దూరమయ్యారు అది వేరే సంగతి.