బెంగళూరులో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య, మూడు రోజుల తరువాత!
బెంగళూరు: కుటుంబ సమస్యల కారణంగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగింది. యశవంతపురంలో నివాసం ఉంటున్న ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని ఆదివారం వెలుగు చూసింది.
యశవంతపురంలోని ముత్యాలనగర్ లో గత రెండు సంవత్సరాల నుంచి శేషశయన, అతని భార్య ఉషా, అతని తల్లి సుధా నివాసం ఉంటున్నారు. శేషశయన టైలర్ పని చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు. గత మూడు రోజుల నుంచి వీరు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాలేదు.
శేషశయన ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా శేషశయన, అతని భార్య ఉషా, అతని తల్లి సుధా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.
శేషశయన కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నాడని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలో విసిగిపోయిన శేషశయన కుటుంబ సభ్యులు సామూహికంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు.