ఉద్యమకారుల రిజర్వేషన్ల కోసం: మూడు రోజులుగా చెట్లపైనే మహిళలు
డెహ్రాడూన్: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ముగ్గురు మహిళలు చెట్లెక్కి కూర్చున్నారు. అంతవరకు చెట్లు దిగేదిలేదని తేల్చి చెప్పారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు ససేమిరా అంటున్నారు. బలప్రయోగం చేసి దించుతామంటే.. అది కలెక్టర్ కార్యాలయంలోని చెట్లు కావడంతో అధికారులు అందుకు పూనుకోలేదు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ భూమా రావత్, సావిత్రి నేగి, భువనేశ్వరి నేగి అనే ముగ్గురు మహిళలు బుధవారం చెట్లెక్కి కూర్చున్నారు. అంతేగాక 60ఏళ్ల దాటిన వారికి ప్రత్యేక వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎవరు చెప్పినా వారు వినకపోవడంతో ఈ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. బుధవారం నుంచి గురువారం వరకు వారు చెట్లపైనే ఉన్నారు. దీంతో వారి డిమాండ్లపై ఉన్నతాధికారులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఎట్టకేలకు వారి డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రవినాథ్ రమణ్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ పుష్పక్ జ్యోతి, ప్రభుత్వ కార్యదర్శి వినోద్ కుమార్లు స్వయంగా వెళ్లి ఆందోళన చేస్తున్న మహిళలకు తెలిపారు.
అయినా కూడా ఆ మహిళలు చెట్ల పైనుంచి దిగేందుకు నిరాకరించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడితే తప్ప దిగేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక అధికారులు ఆ మహిళలకు మంచినీళ్లు, కిందపడకుండా తాళ్లను అందించారు. గురువారం సాయంత్రం వరకూ వారు చెట్టుపైనుంచి దిగలేదు. శుక్రవారం కూడా వారు చెట్లపైనే ఉన్నట్లు సమాచారం. కాగా, స్థానిక ప్రజల సుదీర్ఘ పోరాటం అనంతరం 2000, నవంబర్ 19వ తేదీన ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఇంతకుముందు చెట్ల రక్షణ కోసం చేపట్టిన ‘చిప్కో' ఉద్యమం కూడా మహిళలు ఈ విధంగానే ఉద్యమం చేశారు. అప్పటి ఉత్తరప్రదేశ్లో 1974లో ఆ ఉద్యమం ఉప్పెనలా సాగింది. చమోలీ జిల్లా రాష్ట్ర అటవీశాఖ లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్లు చెట్లను కొట్టేయకుండా మహిళలంతా చెట్లను కౌగిలించుకున్నారు. తమను నరకండి గానీ.. చెట్లను వద్దు అని నినాదంతో పర్యావరణ పరిరక్షణకు నాంది పలికారు.