గణతంత్ర దినోత్సవం వేళ.. గ్రెనేడ్ల మోత: శక్తిమంతమైన పేలుళ్లు: అరగంట వ్యవధిలో.. !
గువాహటి: దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు కొనసాగుతున్న వేళ.. అస్సాం గ్రెనేడ్ల మోతలతో మారుమోగిపోయింది. రెండు వేర్వేరు జిల్లాల్లో మూడు శక్తిమంతమైన గ్రెనేడ్ల పేలుళ్లు అస్సాంను ఉలిక్కిపడేలా చేశాయి. అరగంట వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అస్సాంవాసులను వణికించాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
అస్సాంలోని దిబ్రూగఢ్, చరైడియో జిల్లాల్లో ఆదివారం తెల్లవారు జామున ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 37వ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రాహం బజార్లో తొలుత రెండు గ్రెనేడ్లు పేలాయి. అనంతరం అరగంట వ్యవధిలో ఓ గరుద్వారా వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదని అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ భాస్కర్ జ్యోతి మహంత్ తెలిపారు. ఈ పేలుడు చోటు చేసుకోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని అన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పేలుళ్లు చోటు చేసుకున్న గ్రాహం బజార్, గురుద్వార వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగుర వేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఈ కార్యక్రమాన్ని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని స్థానికులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు కూడా భద్రతా బలగాలు గుప్పిట్లో ఉన్నాయి. గ్రెనేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వాటిని అమర్చారు? కుట్ర కోణం ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ పేలుళ్ల వెనుక విద్రోహ శక్తుల హస్తం ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తమౌతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు దిబ్రూగఢ్, చరైడియా జిల్లాల్లోనే పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టినట్లు భాస్కర్ జ్యోతి వెల్లడించారు. ఆందోళనకారులు ఉద్దేశపూరకంగా వాటిని అమర్చి ఉండే అవకాశాలను కొట్టి పారేయట్లేదని తెలిపారు.