పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఐఏఎస్ అమ్రపాలి నియామకం...
పీఎంవో కార్యాలయంలో కొత్తగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో మధ్యప్రదేశ్ 2004 కేడర్కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్,ఆంధ్రప్రదేశ్ 2010 కేడర్కు చెందిన అమ్రపాలి కాట,ఉత్తరాఖండ్ 2012 కేడర్కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు.
Recommended Video
ఐఏఎస్ రఘురాజ్ రాజేంద్రన్ పీఎంవో కార్యాలయ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇంతకుముందు ఆయన స్టీల్,పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సెక్రటరీగా సేవలందించారు.
మరో ఐఏఎస్ అమ్రపాలి కాట ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా... తాజాగా పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక అంతకుముందు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ మంగేష్ గిల్దియాల్ తాజాగా పీఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.
కాగా,ఐఏఎస్ అమ్రపాలి గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా,వికారాబాద్ సబ్ కలెక్టర్గా,రంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా,రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించిన అమ్రపాలి చెన్నై ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2010లో ఆమె ఐఏఎస్గా ఎంపికయ్యారు. వరంగల్ కలెక్టర్గా సేవలందించిన సమయంలో ఆమె చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. స్థానికంగా కొంతమంది ఆమె విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.