తలపై నుంచి 50 బుల్లెట్లు వెళ్లాయి: మావో దాడిలో ప్రాణాలతో బయటపడిన దూరదర్శన్ జర్నలిస్ట్
దంతెవాడ: మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు దాడి చేయగా దూరదర్శన్ కెమెరామెన్తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ జర్నలిస్టుకు 50 బుల్లెట్లు దిగాయి.
ఎన్నికల వేళ మావోయిస్టుల ఘాతుకం: దూరదర్శన్ కెమెరామెన్ తోపాటు ఇద్దరు జవాన్లు మృతి
తన తలపై నుంచి 50 బులెట్లు దూసుకెళ్లాయని, ఆ 45 క్షణాలు భయానకంగా గడిచాయని మావోయిస్టుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ దూరదర్శన్ జర్నలిస్టు ధీరజ్ కుమార్ అన్నారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలోని ఎన్నికల ఏర్పాట్లను కవర్ చేయడానికి వెళ్లిన దూరదర్శన్ జర్నలిస్టులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో కెమెరామెన్ అచ్యుతానంద్ సాహూతో పాటు మీడియా బృందానికి భద్రతాగా వెళ్లిన ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన గురించి ధీరజ్ మీడియాకు వివరించారు.
నిల్వాయా ప్రాంతంలో ప్రజలు 1998 నుంచి ఓటు వేయడం లేదని, ఈసారి వారు ఓటేసేందుకు వీలుగా కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కవర్ చేసేందుకు తాను, అచ్యుతానంద్ అక్కడకు వెళ్లామని, వెళ్లేముందు దంతెవాడ ఎస్పీని కలిశామని, ఆయన తమకు అనుమతి ఇచ్చారని, భద్రత కల్పిస్తామని చెప్పారని అన్నారు.
ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మేమూ, భద్రతా సిబ్బంది మోటార్ సైకిళ్లపై బయల్దేరామని, కాసేటికే తమ ముందు వెళ్తున్న బైక్ కిందపడిపోయిందని చెప్పారు. ఆ వెనుకే ఉన్న తమ కెమెరామెన్ సాహూకు బులెట్ తగిలిందని, తన కళ్లముందే అతను కుప్పకూలిపోయాడన్నారు.
తాను కూర్చున్న బైక్ కూడా కిందపడిపోయిందని, అదృష్టవశాత్తు తాను పక్కనే ఉన్న ఓ గుంతలో పడిపోయానని, అక్కడే దాక్కున్నానని, ఆ తర్వాత 45 నిమిషాలు చాలా భయానకంగా గడిచిందని చెప్పారు. బులెట్ శబ్దాలు తనకు వినిపిస్తూనే ఉన్నాయని, దాదాపు 50 బులెట్లు తన తలపై నుంచే వెళ్లాయని, గుంతలో ఉండటంతో మావోయిస్టులు తనను చూడలేదన్నారు.