బెంగళూరులో విషాదం: కుప్పకూలిన వాటర్ ట్యాంక్..శిథిలాల కింద పలువురు కూలీలు
బెంగళూరులో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ వాటర్ ట్యాంక్ ఒక్క సారిగా కుప్పకూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బెంగళూరులోని అమృతహళ్లిలో చోటుచేసుకుంది. 30 ఎకరాల ప్లాట్లో కొత్తగా నీళ్ల ట్యాంకును నిర్మిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 25 మంది కూలీలు ఉన్నారు. పనిచేస్తున్న సమయంలో కూలీలు హెల్మెట్లు ధరించారు కానీ రక్షణగా నిలిచే దుస్తులను ధరించలేదని ఈశాన్య బెంగళూరు డీసీపీ తెలిపారు.
నీళ్ల ట్యాంకు కూలిందన్న సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంది.ఇక శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని బయటకు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల కింద నుంచి 15 మందిని బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కొలంబియా ఏషియా హాస్పిటల్కు తరలించగా మరో నలుగురిని చైతన్య హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు.ఇక మిగతా వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.
Bengaluru: An under-construction water tank centering of a sewage treatment plant being constructed by Bangalore Water Supply and Sewerage Board collapses. Rescue operations underway. #Karnataka pic.twitter.com/uXia2LadUH
— ANI (@ANI) June 17, 2019
నీళ్ల ట్యాంకు సీలింగ్ను నిర్మిస్తున్న సమయంలో ఈ విషాదకర ఘటన జరిగిందని డీసీపీ తెలిపారు. సీలింగ్ ఒక్కసారిగా కూలడంతో వీరంతా దానికింద చిక్కుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ ట్యాంకు నిర్మాణం చేసేందుకు వచ్చిన కూలీలంతా బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందినవారిగా గుర్తించడం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే నీళ్ల ట్యాంకు ఎలా కూలిందనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును బెంగళూరు నీటిసరఫరా మరియు సువరేజ్ బోర్డు నిర్మిస్తోంది. ఇదే బోర్డు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ఱ బైరే గౌడ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్రిమినల్, నిర్లక్ష్యం కింద ప్రస్తుతం కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరులో గత రెండు నెలల్లో నిర్మాణంలో ఉన్న ఒక కట్టడం కూలడం ఇది రెండోసారి కావడం విశేషం. ఏప్రిల్ 5వ తేదీన మల్టీలెవెల్ కార్ పార్కింగ్ను నిర్మిస్తున్న సమయంలో అది కూలడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరులోని యశ్వంత్పూర్లో జరిగింది. మృతి చెందిన ఇద్దరు కూలీలు పార్కింగ్ నిర్మిస్తున్నవారే కావడం విశేషం.