బెంగళూరులో గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం: ముగ్గురి మృతి !
బెంగళూరు నగరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన ఈజీపుర ప్రాంతంలో జరిగింది.
Recommended Video
బెంగళూరు: బెంగళూరు నగరంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన ఈజీపుర ప్రాంతంలో జరిగింది. ఈజీపురలోని గుండప్ప లేఔట్ లోని చర్చి రోడ్డు, 7వ క్రాస్ లో గణేష్ అనే వ్యక్తి ఇంటిలో సోమవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో కళావతి అలియాస్ సంజనా (38), రవిచంద్రన్ అలియాస్ శరవణ (20), అశ్విన్ (22) అనే ముగ్గురు మరణించారు. ఇద్దరు పిల్లలతో పాటు ఆరు మందిని రక్షించి సెయింట్ జాన్స్, సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
20 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిలో సోమవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. భారీ వర్షాల కారణంగా, వంట గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వలన మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ ప్రమాదంలో చుట్టుపక్కల ఉన్న ఇళ్లు దెబ్బతిన్నాయని పోలీసులు చెప్పారు. కట్టడం శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అంటూ అగ్నిమాక సిబ్బంది, బీబీఎంపీ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు.