కేరళ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్..ముగ్గురు మావోలు హతం
పాలక్కడ్ : కేరళలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులను కేరళ కమాండ్ ఫోర్స్కు చెందిన థండర్బోల్ట్స్ హతమార్చాయి. పాలక్కడ్లోని అట్టపడి హిల్స్లో సోమవారం ఉదయం కేరళ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ఏడుగురు సభ్యులతో ఉన్న మావోయిస్టుల బృందం వారిపై కాల్పులకు దిగింది. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగడంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళా మావోయిస్టు కూడా ఉంది. మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు గుర్తించారు.
ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులలో ఇద్దరిని గుర్తించిన పోలీసులు వారిలో ఒకరు తమిళనాడుకు చెందిన కార్తీక్ కాగా మరొకరు కర్నాటకకు చెందిన మహిళా మావోయిస్టు జ్యోతిగా గుర్తించడం జరిగింది. ఇక తప్పించుకుని పారిపోయిన నలుగురు మావోయిస్టుల కోసం కేరళ థండర్బోల్ట్స్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కొన్ని గంటలుగా జల్లెడ పడుతున్నామని చెప్పిన పోలీసులు ప్రస్తుతం కాస్త విరామం ఇచ్చామని తెలిపారు. భారీ వర్షాలు కురవడం, చిమ్మచీకటిగా ఉండటంతో సెర్చ్ ఆపరేషన్కు విరామం ఇచ్చినట్లు సీనియర్ కమాండో పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం తమకు అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు గిరిజనుల నుంచి వారు ఆహారం కోసం బెదిరింపులకు దిగారనే ఫిర్యాదు తమకు అందిందని పోలీసులు తెలిపారు. ఇక నిఘా పెంచడంతో పోలీసుల బృందానికి మావోయిస్టుల కదలికలు కనిపించడంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టినట్లు పోలీసులు చెప్పారు. అట్టపడి కొండలు సమీప అడవుల్లో గత కొన్ని రోజులుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే స్పష్టమైన సమాచారం ఉన్నిందని చెప్పారు.
ఇదిలా ఉంటే 2018 పాలక్కడ్ జిల్లా మావోయిస్టులకు స్వర్గధామంగా నిలిచిందని వారి కార్యకలాపాలకు నెలవై ఉందని కేంద్రప్రభుత్వం ఇచ్చిన నివేదికతో కేరళ ప్రభుత్వం అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా పెంచింది. అయితే సోమవారం స్పష్టమైన సమాచారం ఉండటంతో రంగంలోకి దిగిన పోలీసుల బలగాలు మావోయిస్టులపై కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు మరో నలుగురు తప్పించుకున్నారు.