కాశ్మీర్ లో ఉగ్రవాదుల తిష్ఠ..ముగ్గురి కాల్చివేత: భారీ ఎన్ కౌంటర్
శ్రీనగర్: భద్రతా బలగాల అనుమానాలు నిజమయ్యాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన హెచ్చిరికలు వాస్తవ రూపం దాల్చాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భారీ ఎత్తున విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు కొద్ది రోజులుగా భద్రతా బలగాలను అప్రమత్తం చేస్తూ వస్తోన్న పరిస్థితుల్లో.. వాటిని నిజం చేస్తూ కొందరు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దుల్లో మాటు వేశారు. ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి అందిన పక్కా సమాచారం ప్రకారం.. వారి స్థావరంపై బుధవారం ఉదయం సరిహద్దు భద్రతా జవాన్లు దాడి చేశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఆర్మీ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతనాగ్ జిల్లా పజల్ పొర ప్రాంతంలో ఉగ్రవాదులు తిష్ఠ వేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి అందిన సమాచారం మేరకు ఆ ప్రాంతంపై జవాన్లు దాడి చేశారు. ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారం.
ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డారు. గాయపడ్డ జవానును అనంతనాగ్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారిగా నిర్ధారించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించారా? లేక స్థానికులా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. మృతదేహాలను గుర్తు పట్టడానికి భద్రతా బలగాలు స్థానికుల సహాయాన్ని తీసుకుంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు మోహరించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ముందు నుంచీ హెచ్చరిస్తూనే వస్తున్నారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా వారు భారత్ భూభాగం మీదికి అక్రమంగా ప్రవేశించి, భారీ ఎత్తున విధ్వంసానికి దిగే ప్రమాదం లేకపోలేదని చెబుతూ వచ్చారు.
దీనికి అనుగుణంగా సైనికాధికారులు సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచారు. అదనపు బలగాలను సరిహద్దులకు తరలించారు. ఈ పరిస్థితుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందినవారిగా అనుమానిస్తున్న ఈ ముగ్గురు ఉగ్రవాదులు స్థానికులే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.