ఏకే 47తో క్రికెట్: భారత భద్రతా దళాల దెబ్బకు ముగ్గురు ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని సతోరా అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని ఓ సీనియర్ అధికారి మీడియాకు చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా, సతోర అటవీ ప్రాంతంలోని త్రాల్ లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. విషయం పసిగట్టిన ఉగ్రవాదులు భారత భద్రతా దళాల మీద కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తం అయిన భారత భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు అంతమయ్యారు. ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. త్రాల్ ప్రాంతంలో ఇటీవల ఏకే 47 ను స్టంప్ గా పెట్టుకుని ఉగ్రవాదులు క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చిని విషయం తెలిసిందే.
హిజ్బల్ ముజాహిద్దిన్ కమాండర్ బుర్హాన్ వనీకి సంతాపంగా ఉగ్రవాదులు భారత్ మీద పెద్ద ఎత్తున దాడులు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో అమరనాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికుల బస్సు మీద ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదులు దాడిలో ఏడుగురు భక్తులు మృత్యువాతపడ్డారు. అమరనాథ్ యాత్రికుల మీద దాడి జరగడంతో కేంద్ర ప్రభుత్వం సైనిక దళాలతో భద్రత కట్టుదిట్టం చేసింది.