Coronavirus: లాక్ డౌన్ అంటే లెక్కలేదు, రోడ్లులో జల్సాలు, దేశంలో మొదటి జైలు శిక్ష !
ముంబై/ పూణే: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. అయితే పనిపాట లేకుండా జులాయిగా రోడ్ల మీదకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ జల్సాలు చేస్తున్న ముగ్గురికి పోలీసులు ఎంత చెప్పినా వారు మాత్రం మాట వినలేదు. పోలీసులకు ఎక్కడో మండిపోయి జులాయిగా తిరుగుతున్న యువకులను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి జులాయిగా తిరుగుతున్న ముగ్గురికి జైలు శిక్ష, జరిమానా విధించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నియమాలు ఉల్లంఘించిన వారికి మొదటి సారి మహారాష్ట్రలో జైలు శిక్ష పడింది.
Coronavirus: ఢిల్లీ మర్కజ్ లాగే మరో దర్గాలో వందల మంది, ప్రజల ప్రాణాలతో చెలగాటం !
కరోనా వైరస్ మహమ్మారి
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ విధించారు. మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ అవుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
రోడ్ల మీద తిరిగితే కరోనా వస్తుంది వెళ్లిపోండి
మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతిలో రోడ్ల మీద తిరగకూడదని, ఇళ్లలోనే ఉండాలని స్థానికులకు పోలీసులు మనవి చేశారు. అయితే స్థానికంగా నివాసం ఉంటున్న అఫ్జల్ అత్తార్ (39), చంద్రకుమార్ షా (38), అక్షయ్ షా (32) తదితరులు పదేపదే రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టారు. రోడ్ల మీద తిరిగితే కరోనా వైరస్ వస్తోంది, ఇళ్లకు వెళ్లిపోండి నాయనా అంటూ పోలీసులు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు.
రోడ్లు ఖాళీగా ఉన్నాయని !
లాక్ డౌన్ అమలులో ఉన్నా వీళ్లు ప్రతిరోజు బైక్ లో రోడ్ల మీదకు వచ్చి హల్ చల్ చేశారు. రోడ్ల మీద తిరగకూడదని స్థానిక పోలీసులు కొన్ని రోజుల నుంచి స్థానిక యువకులకు గట్టిగానే చెబుతున్నారు. అయితే వీళ్లు ఏ మాత్రం పట్టించుకోవకుండా ఉదయం, సాయంత్రం ముఖాలకు మాస్క్ లు కూడా వేసుకోకుండా రోడ్లు ఖాళీగా ఉన్నాయని బైక్ ల్లో అటూ ఇటూ తిరుగుతూ హల్ చల్ చేశారు.
దెబ్బకు దెయ్యం దిగింది
ఎంత చెప్పినా మాట వినకపోవడంతో అఫ్జల్ అత్తార్, చంద్రకుమార్ షా, అక్షయ్ షా అనే జులాయిలను అరెస్టు చేశారు. ముగ్గురిని బారామతి న్యాయస్థానం న్యాయమూర్తి జె.జె. బచుల్కర్ ముందు హాజరుపరిచారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన ముగ్గురిని మూడు రోజుల పాటు జైలుకు పంపించాలని, ఒక్కొక్కరి దగ్గర రూ. 500 చొప్పున జరిమానా వసూలు చెయ్యాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
సినిమా కథలు చెప్పారు, అందుకే !
ఎలాంటి కారణం లేకుండా ఈ ముగ్గురు లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీద తిరిగారని, ఎలాంటి కారణం లేకుండా ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించినందుకు పోలీసులపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించారని, అందుకే ఐపీసీ సెక్షన్ 188 కింద అరెస్టు చేసి జైలుకు పంపించామని బారామతి డిప్యూటి పోలీసు కమిషనర్ నారాయణ్ షిర్గాన్కర్ మీడియాకు చెప్పారు.