దాడి చేశారు: రూ. 50 లక్షల నగలు లూటీ
బెంగళూరు: బంగారు నగల షోరూం డోర్ లు తీస్తున్న సెక్యూరిటీ గార్డుల పై దాడి చేసిన నిందితులు రూ. లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేసి పరారైన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రహదారిలోని యలహంక సమీపంలోని ద్యారకా నగర్ లో ప్రసిద్ధి చెందిన రాజలక్ష్మి జ్యువెలర్స్ షో రూం ఉంది. ప్రతి రోజు ఉదయం 7.30 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డులు ఇక్కడ షోరూం డోర్లు తీస్తుంటారు.
శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డులు షోరూం తలుపులు తీస్తున్నారు. అదే సమయంలో బ్లాక్ పల్సర్ బైక్ లో వచ్చిన ముగ్గురు దుండగులు సెక్యూరిటీ గార్డుల మీద దాడి చేశారు.
తరువాత బంగారు నగలు ఉన్న మూడు బాక్స్ లు లాక్కొని అక్కడి నుంచి పరారైనారు. షోరూం ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు. రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు లూటీ అయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.