3 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు- షెడ్యూల్ ప్రకటించిన ఈసీ- నవంబర్ 10న ఫలితాలు..
బీహార్ శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఈ ఏడాది నవంబర్ 29తో బీహార్ శానససభ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. కరోనా ప్రభావం మొదలయ్యాక నిర్వహిస్తున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మేరకు అన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అదనంగా 3 లక్షల వలస కూలీలు ఓటర్లుగా!
బీహార్ శాసనసభకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 28న, రెండో విడత నవంబర్ 3న, మూడో విడత ఎన్నికలు నవంబర్ 7న నిర్వహిస్తారు. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో 17 జిల్లాల్లోని 94 స్ధానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశలో 78 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ అరోరా ప్రకటించారు.
బీహార్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్ధులు ఆన్లైన్ లోనే నామినేషన్లు వేయడంతో పాటు ఆన్లైన్లోనే ద్వారా డిపాజిట్లు చెల్లించాలని ఈసీ పేర్కొంది. అభ్యర్ధుల ప్రచారం విషయంలోనూ భౌతిక దూరంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈసీ తెలిపింది. కేవలం ఐదుగురిని మాత్రమే ఇంటింటి ప్రచారానికి అనుమతిస్తామని సీఈసీ సునీల్ ఆరోరా ప్రకటించారు. ఏడు లక్షల యూనిట్లకు పైగా శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నట్లు సీఈసీ తెలిపారు. 46 లక్షల మాస్కులు, ఆరు లక్షలకు పైగా పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు అరోరా పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో నిర్వహిస్తున్న బీహార్ ఎన్నికలు తమకు పెను సవాలుగా అరోరా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాసందర్భంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎన్నికల పోరు ఇదేనని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 16 లక్షలకు పైగా వలస కార్మికులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. పోలింగ్ సమయాన్ని గంట మేర పెంచారు. గతంలో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఉండగా.. బీహార్లో మాత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కు అనుమతించబోతున్నారు. ఈ చివరి గంటలో కోవిడ్ రోగులను ఓటింగ్కు అనుమతించనున్నారు.