పోలీసుల దాష్టీకం: అక్కా చెల్లెళ్లను వివస్త్రలను చేసి కొట్టారు.. ఖాకీలను సస్పెండ్ చేసిన డీజీపీ
అస్సాం: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులయ్యారు. కస్టడీలో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై దాష్టీకం ప్రదర్శించారు. అంతేకాదు వారిని వివస్త్రలుగా చేసి లాఠీలు ఝుళిపించారు. ఈ దారుణ ఘటన దరాంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తమ సోదరుడిపై కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ పేరుతో ముగ్గురు అక్కాచెల్లెళ్లను స్టేషన్కు తీసుకెళ్లారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వీరి సోదరుడు, ఓ హిందూ అమ్మాయిని అపహరించాడనే కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఔట్పోస్ట్ స్టేషన్ ఎస్ఐ మహేంద్ర శర్మ, మహిళా కానిస్టేబుల్ బినితా బోరోలను సస్పెండ్ చేసినట్లు అస్సాం డీజీపీ తెలిపారు. అంతేకాదు వారంరోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు.
సెప్టెంబర్ 10న పోలీసుశాఖకు తమకు జరిగిన అవమానం గురించి అక్కా చెల్లెళ్లలో ఒకరు సుదీర్ఘ లేఖను రాశారు. అందులో ఎస్ఐ మహేంద్రశర్మ, మహిళా కానిస్టేబుల్ బోరోలు తమను వివస్త్రలుగా చేసి తమ ప్రైవేట్ పార్ట్స్ను తాకారని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు అక్కా చెల్లెళ్ల వయస్సు 28, 30, 18 ఏళ్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9న తెల్లవారుజామున 1:30 గంటలకు తమను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆ పై తమ సోదరుడిపై కేసు నమోదు చేశారు.
తన సోదరుడు అపహరించిన మహిళతో పాటు ఆయన ఎక్కడున్నాడో చెప్పేవరకు నరకయాతన అనుభవించామని చెప్పారు. అయితే తను షిలాంగ్లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నాక తమను వదిలారని చెప్పారు. ఇక అమ్మాయితో పాటు సోదరుడు ఉదయం 6:30 గంటలకు పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తున్నట్లు తెలిపారు.
ఇద్దరి మధ్య సంబంధం ఉందని అందుకు తగిన ఆధారాలున్నాయని మరో మహిళ తెలిపింది. తన సోదరుడు అమ్మాయిని కిడ్నాప్ చేయలేదని వెల్లడించింది. బలవంతంగా తమను పోలీస్ స్టేషన్కు లాక్కెల్లారని అక్కాచెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు తమను వివస్త్ర చేసి హింసించిన తీరు వివరించారు. వారి శరీరాలపై ఉన్న గాయాలకు సంబంధిచిన ఫోటోలను డీజీపీ చూసి ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.