సుమలతకు ముగ్గురు డూపులు: సినిమాల్లో కాదు రాజకీయాల్లో! కన్ఫ్యూజ్ కోసం
మండ్య: మన ఏపీలోనే అనుకుంటే కర్ణాటకలో కూడా కే ఏ పాల్ వంటి క్యాండిడేట్లు తయారయ్యారు. అసలు అభ్యర్థిని పోలిన పేర్లతో రంగ ప్రవేశం చేయడం, ఓటర్లను గందరగోళంలో పడేయటం, మెజారిటీని తగ్గించడమో, అసలు గెలుపు అనేదే లేకుండా చేయడమో వారి ప్రధాన ఉద్దేశం. తాము ఓడిపోయినా ఫర్వాలేదు.. తమ ప్రత్యర్థి గెలవకూడదనేది వారి ప్రధాన సూత్రం. ఈ కారణంతోనే ప్రజాశాంతి పార్టీ పేరుతో కే ఏ పాల్ ఇప్పటికే మన రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోలిన పేర్లతో తన క్యాండిడేట్లను పోటీకి నిలిపారు. ఈ వ్యవహారం ఎన్నికల సంఘం దృష్టికి చేరింది.
కర్ణాటకలో కూడా ఇలాంటి వ్యవహారమే తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో ప్రతిష్ఠాత్మక మండ్య లోక్ సభ స్థానం కోసం మన తెలుగింటి ఆడపడచు, సీనియర్ నటి సుమలత పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుగా స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఇదే స్థానంలో ఆమెతో పాటు మరో ముగ్గురు సుమలతో ఎన్నికల బరిలో దిగారు.
ఈ స్థానం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. కన్నడ రెబల్ స్టార్, దివంగత కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలతకు పోటీగా ముగ్గురు సుమలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సుమలత మంజేగౌడ, సుమలత సిద్ధేగౌడ, ఎస్ సుమలత అనే ముగ్గురూ వేర్వేరుగా నామినేషన్లను వేశారు. వారు ముగ్గురూ మండ్య జిల్లాకు చెందిన వారే.
మండ్య జిల్లా కేఆర్ పేట్లో కు చెందిన సుమలత మంజేగౌడ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నట్లు తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. సుమలత సిద్ధేగౌడ అనే మహిళ కూడా పదో తరగతి వరకు చదువుకున్నారట. జిల్లా కేంద్రమైన మండ్యకు చెందిన మహిళ ఆమె. ఎస్ సుమలత అనే మరో మహిళ తాను పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు నామినేషన్ లో పేర్కొన్నారు. రామనగర జిల్లా కనకపురలో ఆమె కుటుంబం నివాసం ఉంటోంది.
దీనిపై అసలు సుమలత స్పందించారు. తనను ఓడించడానికి ప్రత్యర్థులు పన్నిన వ్యూహమని అన్నారు. ఓడిపోతామన్న భయంతోనే ప్రత్యర్థి పార్టీలు ఇటువంటి పనులు చేస్తున్నాయని చెప్పారు.