మూడుసార్లు ఎమ్మెల్యే దారుణ హత్య: భూ వివాదం కారణం?
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ రాజకీయ నేత నిర్వేంద్ర కుమార్ మిశ్రా(75)ను దుండగులు హత్య చేశారు. ఆయన హత్యకు భూ వివాదమే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
త్రికోలియా పధౌ బస్ స్టేషన్ సమీపంలో కొందరు స్థానికులే మిశ్రాను దారుణంగా హతమార్చారు. తమ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు మారణాయుధాలతో వచ్చి మాజీ ఎమ్మెల్యే నిర్వేంద్ర కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు సంజీవ్ మిశ్రాపై దాడి చేశారని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు.
ఈ దాడిలో నిర్వేంద్ర మరణించగా.. ఆయన కుమారుడు సంజీవ్ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంజీవ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. నిర్వేంద్ర మిశ్రా మృతదేహాన్ని రహదారిపై ఉంచి ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.
కాగా, ఈ భూమికి సంబంధించిన కేసు ఒకటి కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. పల్లియాకు చెందిన సమీర్ గుప్తా, రాధేశ్యామ్ గుప్తాలతో మిశ్రాకు ఈ భూమి వివాదం కొనసాగుతోంది. సమీర్ గుప్తా పేరున ఉన్న ఈ భూమిని తనదేనంటూ మిశ్రా వాదించడమే ఈ వివాదానికి కారణం. ఈ నేపథ్యంలో గుప్తాల ఫిర్యాదు మేరకు మిశ్రా, అతని కుమారుడిపై కేసు నమోదైంది.
కాగా, నిందితులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని మిశ్రా కుటుంబసభ్యులు ఆరోపించారు. మిశ్రా రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి సమాజ్వాదీ టికెట్ పై గెలుపొందారు.
భూమి గురించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నేలకూలారని పోలీసులు తెలిపారు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారని చెప్పారు. అయితే, మిశ్రా ఒంటిపై ఎలాంటి గాయాలున్నట్లు గుర్తించబడలేదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపడతామని తెలిపారు.
కాగా, ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక మాజీ ఎమ్మెల్యే హత్యకు గురికావడం జంగిల్ రాజ్కు సంకేతమా? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే యూపీ సర్కారు నిద్రపోతుందా? అని నిలదీశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా యూపీ సర్కారుపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే హత్య ఆందోళనకర విషయమని అన్నారు. నిందితులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా యూపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. ఈ బీజేపీ సర్కారు హయాంలో రక్షణ లేకుండా పోతోందని, భయంగా ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సర్కారుపై విమర్శల దాడిని పెంచుతున్నాయి.