కొత్త పార్లమెంటు నిర్మాణంలో అద్భుతం- 3 సొరంగాలు-ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇళ్లతో కనెక్టివిటీ
ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో మరో ప్రత్యేకత చోటు చేసుకోనుంది. ప్రస్తుత పార్లమెంటు భవనంలో లేని ఓ సరికొత్త ఏర్పాటును ఈసారి సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో చేపడుతున్నారు. దీంతో ప్రధాని, ఉపరాష్ట్రపతి తమ నివాసాల నుంచి ఎంపీలు తమ ఛాంబర్ల నుంచి రోడ్డుపైకి రాకుండానే భూగర్బం నుంచే పార్లమెంటుకు చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భద్రతా పరంగా కూడా వారు సురక్షితం కానున్నారు. దీంతో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ సొరంగాల నిర్మాణం ఆసక్తి రేపుతోంది.
సెంట్రల్ విస్తా ప్రాజెక్టు ప్రత్యేకతలు
భారత పార్లమెంటు కొత్త భవనం, ఇతర నిర్మాణాలతో కలిపి చేపడుతున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా పార్లమెంటులో 2వేల మంది ఒకేసారి సమావేశమయ్యే ఏర్పాటుతో పాటు భద్రతాపరంగా ఆధునిక డిజైన్లతో పలు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. ఇప్పుడు దీనికి భూగర్భ సొరంగాలు కూడా ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారింది. దీని వెనుక కూడా పలు కీలకమైన కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ టన్నెల్స్ నిర్మాణం మొత్తం ప్రాజెక్టుకే హైలెట్గా మారబోతోంది.
మూడు భూగర్భ సొరంగాలు ఎక్కడెక్కడికంటే ?
సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా మొత్తం మూడు సొరంగాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఒకటి ప్రధానమంత్రి నివాసానికీ, రెండోది ఉపరాష్ట్రపతి నివాసానికీ, మూడోది ఎంపీల ఛాంబర్లకు అనుసంధానిస్తారు. తద్వారా వీరంతా రోడ్లపైకి ఎక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ భూగర్భ సొరంగాల ద్వారానే పార్లమెంటు లోపలికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు కూడా తగ్గిపోయాయి. వారు కూడా సురక్షితంగా పార్లెమెంటుకు హాజరు కావడం, తిరిగి వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో ఈ సొరంగాల నిర్మాణం ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.
సొరంగాల నిర్మాణ వల్ల ప్రయోజనాలివే
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించే సొరంగాల వల్ల ప్రధాని, ఉఫరాష్ట్రపతి వంటి వీవీఐపీలకు భద్రతా ప్రోటోకాల్స్ గణనీయంగా తగ్గిపోతాయి. ప్రస్తుతం వారికి కల్పిస్తున్న భారీ భద్రత చాలా సమయాల్లో వారికే చికాకు పుట్టించేలా ఉంది. దీంతో ఈ టన్నెల్స్ నిర్మాణం వల్ల వారికి ఆ మేరకు సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు. అంతే కాదు ఈ టన్నెల్స్ కూడా సింగిల్ లైన్లో ఉంటూ గోల్ఫ్ కార్ట్ల ద్వారా ప్రయాణించేందుకు వీలుగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 12 గేట్లు ఉన్నప్పటికీ వీటి ద్వారా కాకుండా వీవీఐపీలు నేరుగా పార్లమెంటు లోపలికి చేరుకునేందుకు ఇవి పనికొస్తాయి.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలు
కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటుతో పాటు ప్రధాని, ఉప రాష్ట్రపతి నివాసాలు కూడా నిర్మిస్తున్నారు. కొత్త పార్లమెంటు దక్షిణ బ్లాక్ వైపు ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం నిర్మిస్తారు. అలాగే నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసం నిర్మిస్తారు. ఈ రెండింటినీ పార్లమెంటుతో అనుసంధానించేలా టన్నెల్స్ నిర్మాణం ఉండబోతోంది. అయితే రాష్ట్రపతి భవనం నుంచి పార్లమెంటుకు ఎలాంటి టన్నెల్ నిర్మించడం లేదు. ప్రధాని, ఉపరాష్ట్రపతులతో పోలిస్తే రాష్టపతి పార్లమెంటుకు వచ్చే సందర్భాలు తక్కువగానే ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.