శబరిమల కేసులో షాకింగ్ ట్విస్ట్: మసీదుల్లో మహిళల ఎంట్రీపై సుప్రీం కీలక నిర్ణయం: 17న విస్తృత భేటీ..!
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల పుణ్యక్షేత్రంలో మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైందవ ఆలయాలకు మాత్రమే పరిమితం చేయకూడదని భావిస్తోంది. మసీదుల్లోనూ మహిళలకు ప్రవేశాన్ని కల్పించాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడింది. శబరిమల రివ్యూ పిటీషన్లకు సంబంధించిన కేసును అన్ని మతాలకు వర్తింపజేయడానికి గల అవకాశాలను పరిశీలించేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది.
Sabarimala: అయ్యప్ప సన్నిధిలో మహిళల ప్రవేశం: ఏడు కాదు.. తొమ్మిది: సుప్రీంలో.. కాస్సేపట్లో..!
విచారణ చేపట్టిన ధర్మాసనం..
శబరిమల ఆలయంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై సోమవారం ఉదయం 10:45 నిమిషాలకు తొమ్మిదిమంది సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె సారథ్యాన్ని వహించారు ఆయనతో పాటు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు.
సరికొత్త మార్గదర్శకాలు..
ఇందులోభాగంగా- ఇప్పటిదకా శబరిమల రివ్యూ పిటీషన్కు సంబంధించిన అన్ని నియమ, నిబంధనలను, మార్గదర్శకాలను సవరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇప్పటిదాకా అనుసరించిన మార్గదర్శకాలు లేదా నియమ నిబంధనలను పూర్తిగా తొలగించి, కొత్త నిబంధనలను పొందుపరచడం లేదా. ఇప్పుడున్న వాటిని కొనసాగిస్తూనే కొత్త అంశాలను ఇందులో చేర్చాల్సిన అంశాలను పరిశీలిస్తోంది.
17న విస్తృత స్థాయి సమావేశం..
అదనంగా చేర్చాల్సిన మార్గదర్శకాలపై ఈ నెల 17వ తేదీన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతోంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు సమావేశ మందిరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె సోమవారం సెక్రెటరి జనరల్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సరికొత్త మార్గదర్శకాల రూపకల్పన కోసం అన్ని రాష్ట్రాలకు చెందిన బార్ కౌన్సళ్లు, న్యాయవాదుల నుంచి అభిప్రాయలను సేకరించాలని సూచించారు.
శబరిమల తీర్పును అన్ని మతాలకూ వర్తింపజేయడం కష్టం..
ఆలయాల్లో మహిళలకు ప్రవేశాన్ని కల్పించాల్సిన పరిస్థితే ఎదురైతే.. దీన్ని అన్ని మతాల వారికీ వర్తింపజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. శబరిమలపై దాఖలైన రివ్యూ పిటీషన్లలో ఇప్పటిదాకా హిందువులు మాత్రమే పాల్గొంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడానికి ఉద్దేశించిన తీర్పును అన్ని మతాలకూ వర్తింపజేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అది ఏకపక్షమౌతుందని పేర్కొంది.
సరికొత్త మార్గదర్శకాల కోసం మూడు వారాల గడువు..
ఈ నేపథ్యంలో.. సరి కొత్త మార్గదర్శకాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మార్గదర్శకాలను రూపొందించడానికి మూడు వారాల గడువు విధించింది. ఈ నెల 17వ తేదీన నిర్వహించ తలపెట్టిన విస్తృతస్థాయి సమావేశం అనంతరం మార్గదర్శకాల కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిళ్ల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సూచించింది. విస్తృత స్థాయి సమావేశంలో చేసిన తీర్మానాలను లోబడి మార్గదర్శకాలను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.