చీరలు విప్పేసి మరీ: ఆ యువకుల ప్రాణాల కోసం అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళలు
తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు చేసిన పని ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడింది. పెరంబలూర్ జిల్లాలోని కొట్టరై ఆనకట్ట వద్ద నీటిలో మునిగి పోతున్న యువకులను చూసిన ముగ్గురు మహిళలు వారిని కాపాడడానికి తమ అభిమానాన్ని పణంగా పెట్టారు. తమ చీరలు విప్పేసి వారిని కాపాడడానికి నీటిలో వేశారు. ఇద్దరు యువకులు వారి చీరలను పట్టుకొని,మహిళల సహాయంతో ఒడ్డుకు చేరగా, మరో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.యువకులను రక్షించడానికి సాహసోపేతంగా మహిళలు చేసిన పనితో ప్రస్తుతం వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది.
చీరలను విప్పి కాలువలో వేసి యువకులను కాపాడిన మహిళలు
అసలేం జరిగిందంటే సిరువాచూర్ గ్రామానికి చెందిన 12 మంది యువకుల బృందం కొట్టరై గ్రామానికి సమీపంలో క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడిన తరువాత, నలుగురు యువకులు కొట్టరై ఆనకట్టలో స్నానం చేయడానికి లోనికి దిగారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల ఫలితంగా ఆనకట్టలోని నీటి లోతు 15 నుంచి 20 అడుగులకు చేరుకుంది. అది గమనించకుండా స్నానం చేయడానికి కొట్టరై కెనాల్ లోకి దిగినవారు మునిగిపోతుండడం గమనించి వారిని కాపాడేందుకు తమ ఒంటిపై ఉన్న చీరలను విప్పి కాలువలో వారికి అందేలా వేసి ఇద్దరి ప్రాణాలను కాపాడారు ముగ్గురు మహిళలు.
నీళ్ళలో మునిగిపోతున్న వారిని కాపాడే ప్రయత్నం
అదునురాయ్ నుండి ముగ్గురు మహిళలు సెంటమిజ్ సెల్వి (38), ముత్తమాల్ (34) మరియు అనంతవల్లి (34) స్నానం చేసి బట్టలు ఉతకడం ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో అప్పటి వరకు క్రికెట్ ఆడి వచ్చిన యువకులు ఈ ఆనకట్ట లో స్నానం చేయవచ్చా అని అడిగారని పేర్కొన్నారు. అయితే వర్షాల కారణంగా నీరు ఎక్కువగా వస్తున్నందున, లోతుగా ఉందని, వద్దని ముందే చెప్పా మని మహిళలు చెప్తున్నారు . కాని నలుగురు యువకులు లోతు ఊహించకుండా నీటిలోకి దిగడంతో వారు మునిగిపోవడం గమనించి తాము ఏమీ ఆలోచించకుండా చీరలను విప్పి నీటిలో పడవేసామని దీంతో ఇద్దరు అబ్బాయిలను రక్షించగలిగామని పేర్కొన్నారు.
ఇద్దరిని కాపాడి, మరో ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేశామన్న మహిళలు .. కానీ
కాని మిగతా ఇద్దరు మేము వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నా లాభం లేకపోయిందని, వారు మునిగిపోయారని చెప్పారు. రక్షించిన ఇద్దరు యువకులను కార్తీక్, సెంథిల్వెల్లాన్ గా గుర్తించగా, మృతులు పవిత్రన్ (17), శిక్షణా వైద్యుడు రంజిత్ (25) లు గా తెలుస్తుంది. నలుగురు యువకులు రక్షించ లేకున్నా ఇద్దరి ప్రాణాలు కాపాడిన మహిళలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
Recommended Video
ప్రాణాల కోసం అభిమానమే పణంగా .. చీరలు విప్పి మరీ మహిళల సాహసం
చీరలు విప్పి నీటిలో వేసి తమ అభిమానాన్ని పక్కన పెట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఇద్దరు ప్రాణాలు కాపాడిన ముగ్గురు మహిళలు చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. సమయానికి వారికి వచ్చిన ఆలోచన, చాలా గొప్ప ఆలోచన అని ప్రతి ఒక్కరూ ఇద్దరి ప్రాణాలు కాపాడిన మహిళలను కొనియాడుతున్నారు. ఇక బ్రతికి బయట పడిన ఆ యువకులు ఆ ముగ్గురు మహిళలకు సలాం చేస్తున్నారు.