దారుణం : పది వేల కోసం పసిపాప హత్య... శవాన్ని పీక్కుతిన్న కుక్కలు..
అలీఘడ్ : మానవత్వం మంటగలిసింది. ముక్కుపచ్చలారని చిన్నారి పట్ల ఇద్దరు దుర్మార్గులు దారుణంగా వ్యవహరించారు. పదివేలు తిరిగి చెల్లించలేదన్న కారణంతో మూడేళ్ల పసిపాప ప్రాణం తీశారు. పాప శవాన్ని కుక్కలపాలు చేశారు. ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టించే ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో జరిగింది. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
బారు అన్నాడు..బీరు అన్నాడు: అడ్వాంటేజ్ తీసుకుని ఎయిర్హోస్టెస్పై కామంతో కాటేశాడు
మూడేళ్ల చిన్నారి కిడ్నాప్
అలీఘడ్ తప్పాల్ ఏరియాకు చెందిన భన్వారీ లాల్ శర్మ దినసరి కూలి. అతనికి భార్య, మూడేళ్ల కూతురు ట్వింకిల్ ఉన్నారు. మే 31 భన్వారీలాల్ కూతురు ట్వింకిల్ కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో వెదికిన కుటుంబసభ్యులు పాప ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కిడ్నాప్ కేసు నమోదుచేశారు.
చిన్నారి హత్య కలకలం
పాప కిడ్నాప్కు గురైన మూడు రోజుల తర్వాత అలీఘడ్ ప్రాంతంలో కలకలం రేగింది. జూన్ 2న ఆ ప్రాంతంలో కొన్ని కుక్కలు ఓ పాప మృతదేహాన్ని పీక్కుతింటున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి కళ్లు, ఓ భుజంతో పాటు పొట్టభాగాన్ని అప్పటికే కుక్కలు పీక్కుతున్నాయి. ఆ పాపను కిడ్నాప్కు గురైన ట్వింకిల్గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
అప్పు ఇచ్చిన వ్యక్తిపై అనుమానం
చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. తమ కూతురిని కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. పాప తండ్రి భన్వారీలాల్ తన తండ్రి వైద్యం కోసం ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి భన్వారీలాల్ ఇంటికొచ్చి గొడవచేశాడు. అంతు చూస్తానని బెదిరించాడు. ఆ వ్యక్తే తమ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం అనంతరం హత్య చేసి ఉంటాడని ట్వింకిల్ తల్లిదండ్రులు ఆరోపించారు.
అత్యాచారం జరగలేదన్న పోస్ట్మార్టం రిపోర్ట్
చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ట్వింకిల్ తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే వారు చిన్నారిని హత్యచేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో వారిపై మర్డర్ కేసు నమోదుచేసి జైలుకు పంపారు.