మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మొండెం నుంచి తల వేరు చేసిన నరరూప రాక్షసుడు
జంషెడ్పూర్ : జార్ఖండ్లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిని ఓ నరరూప రాక్షసుడు నరికి చంపాడు. అత్యాచారం చేసిన అనంతరం మొండెం నుంచి తల వేరు చేశాడు. ముక్కుపచ్చలారని చిన్నారిని అత్యంత దారుణంగా చంపిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బిడ్డ మృతదేహం చూసిన తల్లి రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
చంపి తల వేరు చేసిన దుర్మార్గుడు
గురువారం రాత్రి ఓ మహిళ పని కోసం జంషెడ్పూర్కు వచ్చంది. రాత్రి కావడంతో తన మూడేళ్ల కూతురితో కలిసి స్థానిక టాటానగర్ రైల్వే స్టేషన్లో నిద్రించింది. ఇదే అదునుగా రింకూ అనే వ్యక్తి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. అనంతరం ఆ పసిదానిపై దురాగతానికి పాల్పడి దారుణంగా హతమార్చాడు. తలను మొండెం నుంచి వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఉదయం నిద్రలేచిన తల్లి బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. అయినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు రింకూ చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. మంగళవారం రింకూతో పాటు అతని స్నేహితుడు కైలాష్ను అరెస్ట్ చేశారు.
నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడు రింకూ ఇచ్చిన సమాచారం మేరకు టెల్కో పోలీస్ స్టేషన్ సమీపంలోని దోభీ ఘాట్ వద్ద పొదల్లో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. కేవలం మొండెం మాత్రమే లభ్యం కావడంతో తల కోసం ఆ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. పాప జననాంగాలపై గాయాలు, రక్తపు మరకలు ఉండటంతో చిన్నారిపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. ఇదిలా ఉంటే నిందితుడు మాత్రం తాను హత్య చేయలేదని అంటున్నాడు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాకు చిన్నారిని అమ్మేసినట్లు చెప్పాడు.
నేరచరిత్ర కలిగిన నిందితుడు
చిన్నారిని కిడ్నాప్ చేసిన రింకూ గతంలోనూ ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. 2015లో టెల్కో ఏరియాలో ఏడేళ్ల బాలికను హత్యచేసే ఉద్దేశంతో కిడ్నాప్ చేశాడు. అయితే పోలీసులకు పట్టుబడటంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కొన్ని వారాల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు. శిక్ష అనుభవించినా తీరు మార్చుకోని దుర్మార్గుడు మరో చిన్నారి ప్రాణం తీశాడు.