పెళ్లి చేసుకుంటానన్నాడు..: లాడ్జికి తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్ రేప్!
సేలం: తమిళనాడులోని సేలంలో ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించిన ఓ యువకుడు.. కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి జిల్లా అరూర్ తాలూకా మొరప్పూర్ గ్రామానికి చెందిన మహిళ (25) భర్తతో విభేదాలతో పుట్టింటిలోనే ఉంటోంది. ఆమె తండ్రి కొన్నాళ్ల క్రితం చనిపోగా.. తల్లి మూగ అని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమె తాత అనారోగ్యం కారణంగా సేలంలోని జీహెచ్ ఆసుపత్రిలో చేరాడు.
ఈ నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు ఆమె తరుచుగా ఆసుపత్రికి వెళ్లేది. ఈ క్రమంలోనే అలగాపురానికి చెందిన నయీమ్ (25) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత నెల 29న తన ప్రేమ విషయాన్ని నయీమ్ ఆమెకు తెలిపాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె.. అతనితో పాటు వెళ్లింది.
ఆపై ఆమెను సేలం, ఏర్కాడు ప్రాంతాలకు తీసుకెళ్లిన నయీమ్.. చత్తిరంలోని ఓ లాడ్జిలో ఉంచాడు. అదే లాడ్జిలో ఆమెకు కూల్ డ్రింకులో మద్యం కలిపి ఇచ్చాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. సోదరుడు నఫీస్ (29), స్నేహితుడు రంజిత్ లతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మత్తు నుంచి తేరుకున్న తర్వాత కత్తితో బెదిరించి మరోసారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కితే ఆమె తల్లిని చంపేస్తామని హెచ్చరించారు. బలవంతంగా ఆమె ఏటీఎం కార్డు తీసుకుని అందులో నుంచి రూ.30వేలు డ్రా చేశారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు బుధవారం పోలీసులను సంప్రదించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.