టీసీతో వింత గొడవ: ఫైన్ కట్టను, మాల్యాను లాగింది
ముంబై: 17 బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం... దేశంలోని సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఎంతలా అంటే సామాన్యులు సైతం మాల్యాను ఎందుకు పట్టుకోవడం లేదని పోలీసులనే ప్రశ్నించేంతగా?
మొన్నటి మొన్న తమిళనాడులో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నందుకు గాను ఓ పేద రైతుపై దాడి చేసిన పోలీసులతో అతడి భార్య తమను కొడుతున్నారు సరే... మరి విజయ్ మాల్యాను ఏం చేస్తారంటూ ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి ముంబైలో ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబైలో నివసిస్తున్న భులేశ్వర్ ప్రాంతానికి చెందిన ప్రేమలతా బన్సల్ (44) అనే మహిళ ఇంటికి వెళ్తూ ఎల్ఫిన్స్టోన్ స్టేషన్లో లోకల్ రైలు ఎక్కింది. రైలు మహాలక్ష్మి స్టేషన్ వచ్చేసరికి టికెట్ తనిఖీకి వచ్చిన మహిళా టీసీ ఆమెను టికెట్ అడగగా కొనలేదని సమాధానం చెప్పింది.
దీంతో ఆమెకు రూ.260 జరిమానా విధించారు. అయితే తాను జరిమానా కట్టబోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు రూ. 10తో టికెట్ కొనలేదని తనని ఫైన్ కట్టమంటున్నారని, బ్యాంకుల నుంచి 9వేల కోట్లు రుణం తీసుకుని దేశం నుంచి పారిపోయిన మాల్యాను ఎందుకు అడగటం లేదని ప్రశ్నించింది.
విజయ్ మాల్యాను పట్టుకున్న తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులకు సవాల్ చేసింది. జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమేనని చెప్పింది. దీంతో రైల్వే అధికారులు, పోలీసులు ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు 12 గంటల పాటు వారితో వాగ్వాదానికి దిగింది. ఎంతకీ వినకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆమెను రైల్వే కోర్టు ముందు హాజరుపరిచారు.
దీంతో ఆమెకు వారం రోజులు పాటు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్టు ముంబై డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా తెలిపారు. దీంతో పోలీసులు ఆమె భర్తకు సమన్లు జారీ చేశారు.