ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్రంతో ఉన్న బంధం అనుబంధాన్ని వదులుకోవాల్సిందే అని అన్నారు. జమ్ముకశ్మీర్కు కేంద్రంతో అన్ని రకాల సంబంధాలు దెబ్బతింటాయని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్కు ప్రత్యేక అధికారాలతో పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తోంది.
రాజ్యాంగంలోని 35ఏ అధికరణ హానికరంగా మారుతోందన్న వ్యాఖ్యలను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ ఈ స్టేట్మెంట్ చేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్ధిక అభివృద్ధి జరగడం లేదంటే ఇందుకు కారణం ఆర్టికల్ 35 ఏ అని జైట్లీ తన బ్లాగులో రాసుకున్నారు. 1954లో ఈ ఆర్టికల్ను రాజ్యాంగంలో చేర్చారు. ఈ ఆర్టికల్ జమ్మూకశ్మీర్కు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో ఆరాష్ట్ర ప్రజలకు చెందిన వారే ఆస్తులను కొనడం కానీ అమ్మటం కానీ చేయొచ్చు.
శ్రీరాముని దర్శనం చేసుకోని వారికి భక్తులు ఓట్లు వేయరు: స్మృతీ ఇరానీ
ఆర్టికల్ 370 కేంద్రానికి జమ్ముకశ్మీర్కు మధ్య వారధిలా వ్యవహరిస్తోందని అన్నారు ముఫ్తీ. ముందుగా జైట్లీ ఇది అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక ఆర్టికల్ను ఎత్తివేయడం అంటే మాటలు చెప్పినంత సులువు కాదని ఆమె అన్నారు. ఒకవేళ ఆర్టికల్ 370ని తొలగిస్తే ఇక జమ్ము కశ్మీర్ రాష్ట్రంతో ఎలాంటి సంబంధాలు కేంద్రానితో ఉండవని ఆమె అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలో జమ్ముకశ్మీర్కు ప్రత్యేక స్థానం కల్పించారు కాబట్టి కలిసి ఉంటున్నామని లేదంటే ఎలాంటి షరతులు లేకుండా భారత్లో కలిసి ఉండాలా లేదా అనేదానిపై ఆలోచన చేయాల్సి ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు ముఫ్తీ చేశారు.
#WATCH Mehbooba Mufti: If you break that bridge (Art 370)...then you will have to renegotiate relationship b/w India-Jammu&Kashmir, there will be new conditions...A Muslim majority state, would it even want to stay with you?...If you scrap 370, your relation with J&K will be over pic.twitter.com/HlAMZh3KcC
— ANI (@ANI) March 30, 2019
ఇదిలా ఉంటే ఆర్టికల్ 35 ఏను తొలగించాలని చూసినా దాన్ని బూచిగా చూపి ఏదైనా చేయాలని చూస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు కేంద్రం ఎదుర్కోవల్సి ఉంటుందని ఇప్పటికే మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లాలు కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే.