ముంబైపై ‘టైగర్’ కుట్ర: విమానాన్ని పేల్చేందుకూ ప్లాన్
ముంబై: ముంబైలో 1993 పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకడైన టైగర్ మెమన్... మరో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ముంబై ఘర్షణలకు ప్రతీకారంగా ఏకంగా సహర్ ఎయిర్పోర్టులో విమానాన్ని పేల్చివేయాలని ప్రణాళిక రచించుకున్నాడు.
తద్వారా నగరంలో భారీ భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నినట్లు 1993 పేలుళ్ల కేసులోని నిందితుడైన నాసిర్ అబ్దుల్ కాదర్ కెవల్ తెలిపాడు. ఇందుకోసం ఏకంగా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నాసిర్ చెప్పాడు. అందులో టైగర్ కూడా సభ్యుడిగా ఉన్నాడు.
విమానాశ్రయంలో రన్వేకు దూరంగా ఒక కారులో ఉండాలని, విమానం దగ్గరగా వచ్చినప్పుడు అదును చూసుకుని పేల్చివేయాలన్నది అతడి ప్రణాళిక. భారీనష్టం జరక్కపోయినా... కనీసం దాని రెక్క వరకూ దెబ్బతిన్నా... భయాందోళనలు సృష్టించాలన్న అతడి కోరిక నెరవేరుతుందని భావించాడు.
కానీ, ఈ ప్రణాళికను అమలు చేయకుండా తర్వాత వెనక్కు తగ్గారు. ఈ కుట్రకు సంబంధించిన వివరాలను ‘మెయిల్ టుడే' పత్రిక ప్రత్యేకంగా సేకరించింది. దీంతోపాటు, 1994లో టైగర్ మెమన్ కరాచీలో ఉన్నట్లుగా తెలియచేసే ఆధారాలను కూడా ఈ పత్రిక సంపాదించింది.
అక్కడి యాకూబ్ మెమన్ ఇంట్లో సహచరులతో టైగర్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలనూ ఈ పత్రిక సేకరించింది. ఆ సందర్భంగా ఐఎస్ఐను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఏజెన్సీగా టైగర్ ప్రస్తావించాడు. ఈ సంభాషణలను సిబిఐకి యాకూబ్ మెమన్ తెలియచేసి తాను అమాయకుడినని పేర్కొన్నట్లు కూడా ‘మెయిల్ టుడే' పేర్కొంది.